
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కచ్చితంగా వచ్చే 90 రోజుల్లో 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించలేని విధంగా చర్యలు తీసుకుంటాం.. అని స్పష్టం చేశారు. అలాగే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఈ నిషేధాన్ని విస్తరించాలా లేదా అన్న విషయంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల లడ్డూ వివాదంతోపాటు ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు..
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూకి సంబంధించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేశారు. ఇది సాధారణ నేరం కాదు. ఇది పూర్వ ప్రణాళికతో చేసిన కుట్ర.. అని ఆయన అన్నారు. 2024లో జరిగిన ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో కూడా చంద్రబాబు ఇదే అంశంపై మాట్లాడారు. అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. ఆ ప్రభుత్వ కాలంలో తిరుమల ఆలయ లడ్డూల తయారీలో నాసిరకం పదార్థాలు, జంతు కొవ్వు ఉపయోగించారని ఆయన విమర్శించారు.
ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ వివాదంపై జగన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విషయం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మతపరమైన సంస్థల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. తిరుమల ఆలయ పవిత్రతపై వివాదం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. సుమారు 70 శాతం వరకు వృద్ధి నమోదైంది.. అని వెల్లడించారు.













