
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇస్లాం లేదా క్రైస్తవ మతాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం చెలరేగి ఉండేదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా అలాంటి విషయాలు ఇక్కడ చోటు చేసుకోవని అన్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో కుల భావనలు పెరుగుతున్నాయని, హిందూ ఓటర్లను కులాల వారీగా విభజించడం సులభమవడంతో ఇలాంటి ఘోర నేరాలు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టుపై మాట్లాడిన ఆయన ఈ అంశంపై ఇంకా పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
సమాధానం కోసం భక్తుల ఎదురుచూపులు: పవన్ కల్యాణ్
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) రిపోర్టులో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడారని తేలిందని పవన్ కల్యాణ్ అన్నారు. సీబీఐ నివేదికలోనూ ఇతర రసాయనాలు ఉన్నట్లు వచ్చిందని తెలిపారు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా చేశారని అన్నారు. మాజీ టీటీడీ బోర్డు సభ్యుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు. దీనర్థం ఈ వ్యవహారంలో ఆయనకూ సంబంధం ఉందా.. అని సందేహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు? తిరుమల ప్రసాద పవిత్రతను దెబ్బతీయడానికి ఎవరు కారణం? అనే ప్రశ్నలకు సమాధానం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
భక్తుల్లో పెరుగుతున్న ఆవేదన..
కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిరుమల ప్రధాన దేవతా విగ్రహం దొంగతనం నేపథ్యంగా ఓ వాణిజ్య చిత్రాన్ని తెరకెక్కించిన సందర్భాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆ కథా ఆలోచనకే హిందూ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, ఆ విమర్శలతో ఆర్జీవీ బాలీవుడ్కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్ లో క్షీణత కూడా కనిపించిందని పేర్కొన్నారు. భక్తులలో విశ్వాసం ఉన్నవారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని, నేరస్తులకు తగిన శిక్ష తప్పదని భావిస్తారని అన్నారు. అయితే రోజులు గడుస్తున్నా స్పష్టత రాకపోవడంతో భక్తుల్లో ఆవేదన పెరుగుతోందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి శిక్ష పడుతుందా? ఒక వ్యక్తి కమిటీ పేర్లు బయటపెడుతుందా? దేవాలయ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయని అన్నారు.













