నటి రుక్మిణి వసంత్ కు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బికినీ ఫోటోలు, వీడియోలను సృష్టించి వైరల్ చేసిన ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. నిందితుల వద్ద నుంచి ఈ నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో బాగల్కోట్ జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన రవికుమార్, శివమొగ్గ జిల్లా తీర్థహಳ್ಳಿ తాలూకాకు చెందిన చంద్రకాంత్, బెంగళూరులోని మహాలక్ష్మీ నగర్కు చెందిన రంజిత్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ సమీపంలో బికినీ ఫోటోషూట్ చేస్తున్నట్లు చూపించిన రుక్మిణి వసంత్ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కంటెంట్ నిజమేనని చాలా మంది నమ్మడంతో విస్తృత చర్చకు దారితీసింది. అంతేకాకుండా నటి గ్లామరస్ ఇమేజ్ను స్వీకరిస్తోందంటూ పలు కథనాలు కూడా వెలువడ్డాయి.
విజువల్స్ పూర్తిగా నకిలీవి..
అయితే ఆ విజువల్స్ పూర్తిగా నకిలీవని రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు. అవి కృత్రిమ మేధస్సు సాయంతో రూపొందించిన డీప్ఫేక్ కంటెంట్ అని పేర్కొన్నారు. ఈ నకిలీ ఫోటోలు, వీడియోల కారణంగా తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని వెల్లడించిన ఆమె, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అనంతరం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించిన అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల కాంతారా లెజెండ్ చాప్టర్ 1 లో కనిపించిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు.

స్పందించండి