హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సంధ్య థియేటర్లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ11గా చేర్చారు. 2024 డిసెంబర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్కు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం థియేటర్ యాజమాన్యం, భద్రతా సిబ్బంది, సంబంధిత ఇతరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దాఖలు చేసిన చార్జ్షీట్లో అల్లు అర్జున్ను కూడా ఏ11గా పేర్కొన్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు, న్యాయపరమైన విచారణలో కొనసాగుతుండగా, ఇప్పుడు కోర్టు ఆయనను నేరుగా హాజరు కావాలని ఆదేశించింది.
తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూపు..
కాగా ప్రమాదంలో గాయపడిన మృతురాలి కుమారుడు సాయి తేజ్కు అల్లు అర్జున్ అండగా నిలుస్తున్నారు. అతని వైద్య ఖర్చులను భరిస్తూ, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కోర్టుకు హాజరైతే న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పనున్నారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని, అయినా వారు పట్టించుకోలేదని థియేటర్ యాజమాన్యం ఇది వరకే పేర్కొనగా, పోలీసులు మాత్రం తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని, అల్లు అర్జున్ వస్తున్నట్లు చెప్పలేదని, చెప్పి ఉంటే తాము బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లమని అప్పట్లో ప్రకటించారు. అయితే ఈ కేసు వాదోపవాదాల నేపథ్యంలో చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూస్తే తెలుస్తుంది. అందరూ న్యాయమూర్తి తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

స్పందించండి