
నటి రకుల్ ప్రీత్ సింగ్ గుజరాత్లోని గిర్ అడవిలో చేసిన సఫారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆమె ఓపెన్ జీప్లో నిలబడి వీడియోలు తీస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంపై గిర్ అటవీ అధికారులు కూడా స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల గిర్ నేషనల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ సింహాలను సమీపంగా చూస్తూ తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీడియోలో ఆమె జీప్లో నిలబడి ఉండటం, వాహనం నుంచి కొంత బయటకు వంగి చిత్రీకరణ చేయడం కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది నెటిజన్లు ఇది అడవి సఫారీ నిబంధనలకు విరుద్ధమని కామెంట్లు పెట్టారు.
రకుల్ నిబంధనలను ఉల్లంఘించిందా..
ఈ వివాదంపై గిర్ అటవీ శాఖ అధికారులు స్పందించారు. వీడియోను పరిశీలిస్తున్నామని, ప్రాథమికంగా చూస్తే ఆమె ప్రవర్తన భద్రతా సూచనలకు అనుగుణంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అయితే పూర్తి వీడియోలు, గైడ్ సూచనలు, సంఘటన జరిగిన పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అధికారులు తెలిపిన ప్రకారం గిర్ నేషనల్ పార్క్లో సఫారీ సమయంలో పర్యాటకులు వాహనం లోపలే కూర్చోవాలి. నిలబడటం, పెద్దగా అరవడం, జంతువులకు దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి చర్యలను భద్రతా నిబంధనలకు వ్యతిరేకంగా పరిగణిస్తారు. అడవి జంతువుల ప్రవర్తన అనిశ్చితంగా ఉండటంతో చిన్న తప్పిదం కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తుంటారు.
આ પ્રસારિત થઈ રહેલો વીડિયો અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશદ્વારની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારમાંનો નથી.@nkk_123 @choga_don pic.twitter.com/jTPZDb3Xc9
— DCFSasan-Gir (@dcfsasangir) May 10, 2026
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన..
సోషల్ మీడియాలో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు ఆమె కేవలం ఉత్సాహంతో వీడియో తీశారు.. అని సమర్థిస్తుండగా, మరికొందరు సెలబ్రిటీలు ఇలాంటి సందర్భాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసే ప్రతి చర్యను అభిమానులు అనుకరిస్తారని, అందుకే వారు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వన్యప్రాణి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గిర్ నేషనల్ పార్క్ ఆసియాటిక్ సింహాల ఏకైక సహజ నివాస ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ పార్క్ను సందర్శిస్తుంటారు. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పర్యాటకుల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

స్పందించండి