
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ భేటీలో ఏమేం అంశాలు చర్చకు వచ్చాయన్నది అధికారికంగా వెల్లడి కాలేకపోయినా, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) చార్జిషీట్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్రిక్తతలకు పాల్పడే ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఇద్దరు నేతలు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవులపై చర్చ..?
అలాగే ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీకి ఒక సీటు కేటాయించాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిని కోరినట్టు తెలిసింది. ఇదే కాకుండా నామినేటెడ్ పదవులు, కీలక నియామకాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. కూటమి ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కొంతమంది నేతల ప్రవర్తనపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అలాగే అక్కడి టీడీపీ నేతల మధ్య నెలకొన్న పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలకు సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












