ఏపీ అప్పుల్లో ఉన్నా.. మీకు విలాసాలా?: జగన్ నిప్పులు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

February 19, 2026 9:36 PM
YS Jagan Mohan Reddy criticising Chandrababu Naidu, Pawan Kalyan and Lokesh over special flights.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. Photo Credit: YSR Congress Party/X.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు లగ్జరీ జీవనశైలి గ‌డుపుతున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జ‌గన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఉన్నాయన్నారు. అదే విధంగా లోకేష్, పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఈ విధంగా విహారయాత్రలు చేయడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.

క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాలా: వైఎస్ జ‌గ‌న్

మంత్రి లోకేష్ విదేశీ ప్రయాణాలపై ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్, కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్లాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఒక రోజు విజయవాడలో ఉంటారు, మరుసటి రోజు హైదరాబాద్‌లో ఉంటారు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లి, మరుసటి ఉదయానికే తిరిగి విజయవాడకు రావడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఆ మ్యాచ్‌ను టీవీలోనే చూసినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడి వ్యవహార శైలిని కుక్క తోక వంకరతో పోల్చిన జగన్, ఇంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రవర్తన చేయాలా అని విమర్శించారు. టీవీలో చూడగలిగే మ్యాచ్ కోసం విదేశాలకు వెళ్లడం ప్రజాధన దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని, అప్పులు పెరుగుతున్నాయని పేర్కొన్న జగన్, అలాంటి సమయంలో అధికారంలో ఉన్నవారు విలాసవంతమైన ప్రయాణాల్లో మునిగిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలన్నీ అసత్యాలని ఆయన ఆరోపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment