
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జోనర్లలో తెరకెక్కుతున్న పెద్ది మూవీపై రామ్ చరణ్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడగా, రిలీజ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ అందరిలోనూ ఆతృత పెరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు మరింత ఎక్కువ ప్రమోషన్ కల్పించేందుకు చిత్ర యూనిట్ పెద్ది పవర్ప్లే టూర్ పేరిట ఓ భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. పెద్ది సినిమాపై ఉన్న క్రేజ్ను మరింత పెంచేందుకే ఈ టూర్ను ప్లాన్ చేశామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ముంబైలో ఓ భారీ కార్యక్రమంలో ట్రైలర్ విడుదల అనంతరం, మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే హై వోల్టేజ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రమోషన్లను కొనసాగించనున్నారు. ఆ తరువాత ప్రచార కార్యక్రమం వివరాలను కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది.
టూర్ ప్రచార షెడ్యూల్ ఇదే..
ఐపీఎల్ మ్యాచ్ లో ప్రమోషన్స్ అవ్వగానే పెద్ది టీం మే 23న భోపాల్లో నిర్వహించనున్న ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొననుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార టూర్లో భాగంగా చిత్ర నిర్మాతలు మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ప్రెస్ మీట్లను కూడా నిర్వహించనున్నారు. జూన్ 1, 2 తేదీల్లో వరుసగా విజయనగరం, హైదరాబాద్లలో రెండు ప్రధాన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని, బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
వాయిదా పడుతూ వచ్చిన చిత్రం..
పెద్ది సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైముకు పూర్తికాకపోవడంతోనే విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం చరణ్కు హిట్ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమాతోనైనా ఆయన హిట్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్ది చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందా, లేదా అనే విషయం వేచి చూస్తే తెలుస్తుంది.

స్పందించండి