రామ్చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని ప్రదర్శన కనబరుస్తున్నా చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఇప్పటికీ అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలను తొలగించినప్పటికీ ట్రోల్స్ ఆగడం లేదు. అయితే తాజాగా మేకర్స్ సినిమాకు సంబంధించి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించారు. దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న పలు సీన్లను తాజాగా సినిమాలో కలిపారు. దీంతో కొత్త సీన్లతో సినిమాను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రను సరైన విధంగా చిత్రీకరించలేదని అటు బాలీవుడ్ నుంచి సైతం విమర్శలు వచ్చాయి. అందుకనే మేకర్స్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
రెండు వారాలు ఆగిన తరువాత..
సినిమా విడుదల అనంతరం జాన్వీ కపూర్ పాత్రకు తగిన స్థాయి ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు ప్రేక్షకులు భావించారు. మరోవైపు, తన నటనకు ప్రశంసలు అందుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు కూడా తనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఫైనల్ కట్లో తొలగించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ కథలో స్పష్టత పెరగడం కోసం తొలగించిన భాగాలను తిరిగి జోడిస్తామని, ముఖ్యంగా జాన్వీ పాత్రకు మరింత న్యాయం చేసేలా మార్పులు ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే ఈ మార్పులను వెంటనే అమలు చేయకుండా, సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు వేచి చూడాలని చిత్ర బృందం నిర్ణయించింది. జూన్ 4న విడుదలైన పెద్దికి జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రెండు వారాల ప్రదర్శన పూర్తవడంతో, సవరించిన వెర్షన్ ను జూన్ 18 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
రన్ కొనసాగేనా..
నిర్మాతలు తెలిపిన ప్రకారం కొత్త వెర్షన్లో అదనంగా 5 నిమిషాలు 56 సెకన్ల ఫుటేజ్ను జోడించారు. ఈ కొత్త సన్నివేశాలు కొన్ని పాత్రల ప్రయాణాన్ని మరింత స్పష్టంగా చూపించడంతోపాటు, కథనం ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు. కాగా పెద్ది ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఏపీలో సినిమా బలమైన ప్రదర్శన కనబరచగా, తెలంగాణలో కూడా మంచి వసూళ్లు నమోదు చేసింది. అయితే ఉత్తర అమెరికా మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. కానీ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయినప్పటికీ కొత్త ఫుటేజ్ జోడించడంతో సినిమా థియేట్రికల్ రన్ మరికొంతకాలం కొనసాగుతుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించండి