
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే ఆమె ఎంట్రీని అడ్డుకున్నానని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, ఆ ఆరోపణలను ఖండించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏమీ మిగలలేదని, తెలంగాణలో అది ఓడిపోయిన రాజకీయ శక్తిగా మారిందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేసిన కవిత, 2028 ఎన్నికల్లో జాగృతి పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్ గౌడ్ను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తూ, ఆయనకు ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ కన్వీనర్ పదవి కూడా ఇస్తానని ఎద్దేవా మేళవించిన ఆహ్వానం పంపారు.
రాజకీయాల విషయంలో పూర్తి సీరియస్గానే..
జాగృతి పార్టీ రాజకీయాల విషయంలో పూర్తిగా సీరియస్గా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి నేరుగా వెళ్లి పనిచేస్తామని కవిత తెలిపారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీర్వాదంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించిన కవిత, జాగృతి పార్టీ భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమె తన సొంత పార్టీ ద్వారా స్వతంత్ర రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. అయితే పార్టీని అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎన్నికల బరిలో ఎప్పుడు దిగుతారు అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు.
అప్పటి వరకు పార్టీ బలోపేతం కోసం..
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే అవకాశమే ఎక్కువ. అంతకుముందే ఎన్నికల్లో పోటీ చేసి ఓడితే ఆమె రాజకీయ ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని, అది కీలకమైన 2028 ఎన్నికల సమయానికి నష్టంగా మారవచ్చని వారు భావిస్తున్నారు. అప్పటివరకు పార్టీని బలోపేతం చేసి, సంస్థాగతంగా బలంగా తయారై, తన సోదరుడు కేటీఆర్కు రాజకీయంగా సవాల్ విసిరే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్కు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసి, ఓడిపోయినా ఆయన పరాజయంలో కీలక పాత్ర పోషించిన ఉదాహరణను వారు గుర్తుచేస్తున్నారు.
కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు..
ఇదే మీడియా సమావేశంలో కవిత మరోసారి కేటీఆర్, హరీశ్ రావులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని, కానీ మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్లో మాత్రం మౌనం పాటిస్తారని ఆరోపించారు. మహిళా ఐఏఎస్ అధికారులను అవమానించే విధంగా వచ్చిన కథనాలపై ఎందుకు ఖండన లేదని ప్రశ్నించారు. ఇది నాయకత్వంలోని ఖాళీతనాన్ని, మహిళల పట్ల వారి నిబద్ధత ఎంత లోపభూయిష్టంగా ఉందో బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. మహా న్యూస్పై దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించారని, కానీ మహిళా అధికారులను అవమానించేలా ప్రసారం చేశారనే ఆరోపణలు ఉన్న ఎన్టీవీపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాలే మహిళా అధికారుల గౌరవం కంటే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో కవిత భవిష్యత్ పాత్ర, ఆమె పార్టీ వ్యూహం, కుటుంబ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి.













