
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ తేదీ, వేదిక విషయంలో ఇప్పటివరకు గోప్యతను పాటిస్తూ వచ్చారు. గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగినప్పటికీ, దాని గురించి కూడా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ రాజప్రాసాదంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇది పూర్తిగా డెస్టినేషన్ వెడ్డింగ్గా, కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలోనే జరగనుంది. సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది అత్యంత సన్నిహిత మిత్రులకు మాత్రమే ఆహ్వానం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తిగా కుటుంబ పరమైన కార్యక్రమంగా..?
వివాహాన్ని పూర్తిగా కుటుంబ పరమైన కార్యక్రమంగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఇద్దరూ కలిసి తీసుకున్నారని సమాచారం. మీడియాకు ఎలాంటి అనుమతులు ఉండవని, కార్యక్రమాన్ని పూర్తిగా గోప్యంగా నిర్వహించనున్నారని తెలిసింది. అయితే, వివాహానంతరం హైదరాబాద్లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బిజీ షూటింగ్ షెడ్యూల్ మధ్య కూడా పెళ్లి ఏర్పాట్లపై రష్మిక స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా ఆమె పలుమార్లు ఉదయ్పూర్కు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించిందట. ప్రస్తుతం ఇద్దరూ కలిసి రాబోయే పీరియడ్ డ్రామా రాణ బాలిలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయాలు, వేడుకల కోసం షూటింగ్ నుంచి కొద్ది రోజుల విరామం తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఊహాగానాలకు తెర పడనుందా..?
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన తర్వాతే విజయ్-రష్మిక మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పలు సార్లు కలిసి విహారయాత్రలకు వెళ్లిన దృశ్యాలు అభిమానుల దృష్టిని ఆకర్షించినా, తమ బంధం గురించి ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే, ఇచ్చిన సంకేతాలు మాత్రం అభిమానులు, మీడియాను ఊహాగానాలకు దారి తీసేలా చేశాయి. నిశ్చితార్థం కూడా ఎలాంటి హడావుడి లేకుండా గోప్యంగా జరగడం, ఆ తర్వాత కూడా పుకార్లపై స్పందించకపోవడం ఈ జంట ప్రత్యేకతగా నిలిచింది. ఎట్టకేలకు, ఈ వివాహంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.








