
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) ఆ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని తెలిపాడు. సోమవారం (మార్చి 16, 2026) సంజు మీడియాతో మాట్లాడుతూ మహి భాయ్ (ధోనీ)తో తాను ఫోన్లో మాట్లాడానని, కొన్ని సందర్భాల్లో ధోనీని కలిశానని తెలిపాడు. కానీ ఒకే జట్టులో కలసి ఆడడం తనకు గొప్ప అనుభవం అవుతుందని, ధోనీ నుంచి నేర్చుకునే మంచి అవకాశం లభించనుందని అన్నాడు. అయితే ఈసారి టోర్నీలో తాను సీఎస్కేకు ఆడుతున్నాడు కనుక తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో తలపడాల్సి వస్తే అది భావోద్వేగాలను కలిగించవచ్చని అభిప్రాయపడ్డాడు.
మైదానంలో భావోద్వేగాలకు తావు లేదు: సంజు
ఐపీఎల్లో సంజు శాంసన్ చాలా కాలం పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. మార్చి 30, 2026న గువాహటిలో జరగనున్న తమ తొలి మ్యాచ్లో సీఎస్కే జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. అయితే సంజు ఈసారి సీఎస్కేకు ఆడనున్నాడు. కనుక ఆ మ్యాచ్లో భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉందని సంజు అన్నాడు. ఇక సాంకేతికంగా చూస్తే ఆ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కు హోం మ్యాచ్ అయినప్పటికీ వారికి వ్యతిరేకంగా ఇంకో జట్టులో ఆడడం వల్ల భావోద్వేగాలు కలిగే అవకాశం ఉందని అన్నాడు. అయితే మైదానంలో భావోద్వేగాలు తన ఆటపై ప్రభావం చూపించకుండా చూసుకుంటానని తెలిపాడు.
సీఎస్కేకు ఆడడం సంతోషాన్నిస్తోంది..
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని సంజు శాంసన్ పేర్కొన్నాడు. అభిమానుల నుంచి వస్తున్న ప్రేమ, ఆదరణకు తాను ఎంతో కృతజ్ఞుడినని అన్నాడు. ఇప్పుడు తొలిసారిగా తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్కు వ్యతిరేకంగా ఆడబోతున్నానని, కానీ మైదానంలో భావోద్వేగాలను తాను ప్రభావితం కానివ్వనని, తన సమయం ఆ జట్టులో ముగిసిందని భావించి తాను రాజస్థాన్ రాయల్స్ను వీడానని తెలిపాడు. అయితే ఇప్పుడు వారిని ఎదుర్కొన్నా కూడా తాను తన ఉత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని స్పష్టం చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2026కు ముందు తన ప్రదర్శన అంతగా బాగాలేకపోవడంతో కొంత ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు వివరించాడు. కానీ ప్రపంచకప్ను సాధించడం తనకు ఒక ఆధ్యాత్మిక క్షణంలా అనిపించిందని తెలిపాడు.
సచిన్ ఇచ్చిన సలహాలను మరిచిపోలేను..
ప్రపంచకప్ ఆడేందుకు ఇంటి నుంచి బయలు దేరిన సమయంలో తనకు కప్ సాధిస్తామని అంతగా విశ్వాసం లేదని సంజు తెలిపాడు. కానీ ప్రపంచం మరోలా నిర్ణయించిందని, తాను బాగా ఆడానని, అభిమానుల నుంచి వచ్చిన స్పందన కూడా అద్భుతంగా ఉందని స్పష్టం చేశాడు. కాగా భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. చివరి మూడు మ్యాచ్లలో అతను 89, 97 నాటౌట్, 89 పరుగులను సాధించాడు. ఆ మూడు ఇన్నింగ్స్లలో సూపర్ 8 దశలో వెస్టిండీస్పై చేసిన 97 నాటౌట్ పరుగుల ఇన్నింగ్స్ను తన ముఖ్యమైన ఇన్నింగ్స్గా అతను అభివర్ణించాడు. ఇక టోర్నమెంట్ సమయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అందించిన సలహాలతోనే తాను అంతలా రాణించానని, ఆయన సలహాలను ఎన్నటికీ మరిచిపోలేనని సంజు స్పష్టం చేశాడు.












