
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా ప్రకటించబడడంతో ఈ వివాదం చెలరేగింది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మాజ్ సదాకత్, సల్మాన్ అలీ ఆఘా వరుసగా 75, 64 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు పోటీ పడే స్కోరు అందించారు. అయితే ఈ వివాదం పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో చోటుచేసుకుంది. దీంతో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పై చర్చలు మొదలయ్యాయి. ఈ ఘటన ఆ ఓవర్ నాలుగో బంతి సమయంలో జరిగింది. మొహమ్మద్ రిజ్వాన్ బౌలర్ కుడివైపు బంతిని ఆడగా, సల్మాన్ క్రీజ్ బయటకు వచ్చాడు. అదే సమయంలో బంతిని అందుకోవడానికి ప్రయత్నించిన మెహిదీ హసన్ మిరాజ్తో సల్మాన్ ఢీకొన్నాడు.
సల్మాన్ అలీ ఆఘా రనౌట్..
బంతి డెడ్ అయిందని భావించిన సల్మాన్ దాన్ని తీసుకుని మిరాజ్కు ఇవ్వడానికి వంగి బంతిని ఎత్తుకున్నాడు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మిరాజ్ వెంటనే బంతిని పట్టుకుని వికెట్లపై ఉన్న బైల్స్ను తొలగించాడు. ఆ సమయంలో సల్మాన్ క్రీజ్ బయట ఉన్నాడు. ఈ పరిణామంతో షాక్కు గురైన సల్మాన్ చూస్తుండగానే మైదాన అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు పంపించారు. థర్డ్ అంపైర్ పరిశీలించి రన్ అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన సల్మాన్ మిరాజ్తో కొద్దిసేపు వాగ్వాదం చేశాడు. అనంతరం కోపంగా మైదానం విడిచిపెడుతూ తన హెల్మెట్, గ్లోవ్స్ను నేలపైకి విసిరేశాడు. ఈ సమయంలో అతని సహచర ఆటగాళ్లు వచ్చి అతడిని శాంతింపజేశారు. తరువాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా మిరాజ్ను సమాధానపర్చే ప్రయత్నం చేసినట్లు కనిపించింది.
ఆధిక్యంలో బంగ్లాదేశ్..
మ్యాచ్ విషయానికి వస్తే, పాకిస్తాన్ జట్టు చేసిన 274 పరుగుల స్కోరు ప్రధానంగా మాజ్ సదాకత్ (75), సల్మాన్ ఆఘా (64) అద్భుత ఇన్నింగ్స్లతో నిర్మితమైంది. వీరితో పాటు మొహమ్మద్ రిజ్వాన్ (44), షాహిబ్జాదా ఫర్హాన్ (31) కూడా ఉపయోగకరమైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ తరఫున రిషాద్ హొస్సేన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా, జట్టు కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతం బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.












