
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా, బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ మధ్య చోటుచేసుకున్న రన్-అవుట్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది. ఈ ఘటన అఘా, మహమ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్న సమయంలో జరిగింది. పాకిస్తాన్ తొలి మూడు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ వేసిన ఓవర్లో రిజ్వాన్ బంతిని మృదువుగా గ్రౌండ్ వైపు ఆడాడు. ఆ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్ వద్ద క్రీజు బయట నిలబడి ఉన్న అఘా వైపు నెమ్మదిగా వచ్చింది. బంతి అతని ప్యాడ్లను తాకిన తర్వాత అఘా దానిని ఎత్తుకునేందుకు వంగి ప్రయత్నించాడు.
సల్మాన్ అలీ అఘాకు ఐసీసీ హెచ్చరిక..
అయితే మెహిదీ హసన్ మిరాజ్ వేగంగా బంతిని అందుకుని అఘా ఇంకా క్రీజు బయట ఉన్న సమయంలో బైల్స్ను తొలగిస్తూ రన్-అవుట్కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ను సమర్థించగా, మూడో అంపైర్ కూడా బంగ్లాదేశ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అఘా అవుట్ అయినట్లు ధ్రువీకరించారు. ఈ నిర్ణయంతో అఘా స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియన్కు వెళ్లాడు. టెలివిజన్ దృశ్యాల్లో పాకిస్తాన్ బ్యాటర్ తన అవుట్పై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటనపై ఇప్పుడు ఐసీసీ అధికారికంగా చర్యలు తీసుకుంది. ఢాకాలో బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 ఉల్లంఘనకు పాల్పడినందుకు పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘాకు అధికారిక హెచ్చరిక జారీ చేశారు.. అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
సల్మాన్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్..
అఘా ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బందికి సంబంధించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నిబంధన అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, మైదాన పరికరాలు లేదా ఇతర సదుపాయాలను దుర్వినియోగం చేయడాన్ని సూచిస్తుంది. దీనికి అదనంగా అఘా క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చారు. గత 24 నెలల కాలంలో ఇది అతని మొదటి తప్పిదం. మైదాన అంపైర్లు ఎడ్రియన్ హోల్డ్స్టాక్, తన్వీర్ అహ్మద్, మూడో అంపైర్ కుమార్ ధర్మసేన, నాలుగో అంపైర్ మసుదూర్ రహ్మాన్ ముకుల్ ఈ ఆరోపణను నమోదు చేశారు. లెవల్-1 ఉల్లంఘనలకు కనీస శిక్షగా అధికారిక హెచ్చరిక ఉండగా, గరిష్టంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతిలో) బంగ్లాదేశ్పై రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. నిర్ణాయకమైన మూడో మ్యాచ్ ఆదివారం (మార్చి 15. 2026) ఆతిథ్య జట్టుతో జరగనుంది.












