
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది. గత చిత్రాల రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అయితే ఈ మూవీ తాజాగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. వసూళ్ల విషయంలో ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో శోభు యార్లగడ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. తాను ఇటీవలే ధురంధర్ 2 సినిమాను వీక్షించానని, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని కితాబిచ్చారు.
ధురంధర్ 2 ను పూర్తిగా ఆస్వాదించా: శోభు యార్లగడ్డ
ధురంధర్ 2 చిత్రం కేవలం భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన హవా ప్రదర్శిస్తోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా 9 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డును ధురంధర్ 2 అధిగమించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయంపై శోభు యార్లగడ్డ స్పందించారు. ఆయన ఇంకా చెబుతూ ధురంధర్ 2 చిత్రాన్ని తాను పూర్తిగా ఆస్వాదించానని అన్నారు. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని, కొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తుందని, బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టడం అభినందనీయమని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
బాహుబలి 2 చిత్రం రికార్డు బ్రేక్..
కాగా బాహుబలి 2 చిత్రం 2017 ఏప్రిల్లో రిలీజ్ అయింది. అప్పట్లో నార్త్ అమెరికాలో ఈ మూవీ 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన 10 రోజుల్లోనే ధురంధర్ 2 ఈ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ.1226 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు వివరాలను వెల్లడించాయి. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ మూవీని ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు ప్రశంసల్లో ముంచెత్తారు.












