
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర నిరాశకు గురైన తర్వాత జట్టు భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి. కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే 14 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ప్లేఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. చివరి మూడు లీగ్ మ్యాచ్ల్లో వరుస ఓటములు జట్టు పరిస్థితిని మరింత దెబ్బతీశాయి. దీంతో హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎస్కేకు కొత్త కోచ్ అవసరం లేదని, జట్టులోనే ఎంఎస్ ధోనీ ఉన్నారని అశ్విన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
ధోనీ ఉండగా.. ఇంకొకరు ఎందుకు..
ఒక అభిమాని ఎక్స్లో సరదాగా స్పందిస్తూ ఫ్లెమింగ్ను మార్చినా అశ్విన్ను కోచ్ చేయొద్దు. మ్యాచ్కు ముందే తన యూట్యూబ్ ఛానెల్లో ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటిస్తాడు.. అని కామెంట్ చేశాడు. దీనికి అశ్విన్ తనదైన స్టైల్లో స్పందించాడు. తాను ప్లేయింగ్ ఎలెవన్ మాత్రమే కాదు, బౌలింగ్, బ్యాటింగ్ ప్లాన్లన్నీ కూడా ప్రత్యర్థులకు చెబుతానని, అలా చేస్తే యాంటీ కరప్షన్ యూనిట్ తనను వదిలిపెట్టదంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఇస్తూ ఎంఎస్డీ ఉన్నప్పుడు ఇంకెవరిని వెతుకుతున్నారు? అని అన్నాడు. ఈ ఒక్క వాక్యమే ధోనీ భవిష్యత్తుపై పెద్ద చర్చకు దారితీసింది.
ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు..
ఐపీఎల్ 2026లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తొలుత కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా దూరమైన అతను, తిరిగి కోలుకున్న తర్వాత బొటనవేలి గాయంతో చివరి మ్యాచ్కూ దూరమయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ పదవి లేకపోయినా, సీఎస్కే వ్యవస్థలో అతడి ప్రభావం మాత్రం అలాగే కొనసాగుతోంది. క్రికెట్ అవగాహన, ఒత్తిడిలో ప్రశాంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆటగాళ్ల మేనేజ్మెంట్లో అనుభవం, సీఎస్కే కెప్టెన్గా అతను తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నో మ్యాచ్ల ఫలితాలను మార్చాయి. సీఎస్కే కల్చర్, జట్టు తత్వం, మేనేజ్మెంట్ వ్యవస్థ, ఆటగాళ్లు కూడా అతన్ని అత్యంత గౌరవంతో చూస్తారు. అభిమానుల దృష్టిలో కూడా ధోనీ కోచ్గా వస్తే జట్టుకు కొత్త ఉత్సాహం రావడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై సీఎస్కే మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













