
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబ్లో థంబ్నెయిల్ మాఫియా భారీ స్థాయిలో పెరిగిపోతూ సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తోంది. ముఖ్యంగా ఫేక్ థంబ్నెయిల్స్, మార్ఫింగ్ ఫొటోలతో తప్పుడు వార్తలను వైరల్ చేస్తుండటం పెద్ద సమస్యగా మారింది. ఈ మధ్య కాలంలో అనేక మంది నటీనటులు ఈ ఇబ్బందులకు గురయ్యారు. ఇది కేవలం నటీనటులకు మాత్రమే పరిమితం కాలేదు. హర్ష గోయెంకా వంటి పారిశ్రామిక వేత్తలకు కూడా తలనొప్పిగా మారింది. ఆయన ఐపీఎల్ జట్టు లక్నో పేలవమైన ప్రదర్శన చేసినందుకు ఆయనపై అనేక మీమ్స్ వచ్చాయి. దీంతో ఆయన వాటిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకెళ్లారు. ఇక అల్లు అర్జున్, లావణ్య త్రిపాఠి వంటి నటీనటులు కూడా ఈ సమస్యలపై కోర్టుల దాకా వెళ్లారు. తాజాగా చిరంజీవి కూడా ఈ సమస్య బారిన పడ్డారు. చిరంజీవి ఆరోగ్యం విషమించిందంటూ మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ఓ యూట్యూబ్ ఛానల్ వీడియోను ప్రచారం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై స్పందించిన హైదరాబాద్కు చెందిన ఓ అడ్వకేట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రం..
ఇక సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఆయన ప్రధాన పాత్రలో మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం ఇప్పటికే రిలీజ్ కావల్సి ఉండగా, అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో చిరుకు జోడీగా త్రిష నటించారు. స్టాలిన్ తరువాత వారి కాంబినేషన్లో మళ్లీ వస్తున్న చిత్రం ఇదే కాగా, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నందున మేకర్స్ ఇంకా కచ్చితమైన రిలీజ్ తేదీని ప్రకటించలేదు.
కాగా చిరంజీవి లేటెస్ట్ చిత్రం మన శంకర వర ప్రసాద్ గాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయనకు మరో హిట్ను ఇవ్వగా, చిరుకు బ్లాక్ బస్టర్ హిట్ను సాధించి పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటించారు. అయితే బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న చిత్రానికి టైటిల్ను అనౌన్స్ చేయాల్సి ఉంది.













