
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్లో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు సినీ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహం జరుగుతుందని పెళ్లి కార్డు ద్వారా అందరికీ తెలుసు. కానీ గురువారం సాయంత్రం వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అధికారికంగా ప్రకటన, ఫొటోలు విడుదల కాలేదు. కానీ సాయంత్రం సమయంలో రష్మిక మందన్న తమ పెళ్లి జరిగినట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక అభిమానులు నూతన వధూవరులకు సోషల్ మీడియా వేదికగా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వీరి వివాహం రెండు రకాలుగా జరిగింది.
రెండు పద్ధతుల్లో వివాహం..
గురువారం ఉదయం 10:10 గంటలకు తెలంగాణ సంప్రదాయ హిందూ పద్ధతిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం జరిగింది. విజయ్ తెలంగాణ వాసి కనుక ఆ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు కొడగు పద్ధతిలో వీరి వివాహం మళ్లీ జరిగింది. రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) కాగా ఆ సంప్రదాయం ప్రకారం సాయంత్రం వివాహం చేసుకున్నారు. కాగా అభిమానులు వీరికి ఇప్పటికే VIROSHI అనే పేరు పెట్టగా ప్రస్తుతం ఈ పేరిట సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.
ఫొటోలు ఆలస్యం..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చాలా కాలం కిందటి నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి ప్రేమ గురించి వీరు ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. పలు మార్లు విదేశీ టూర్లకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల పెళ్లి చేసుకుంటున్నామని వారు స్వయంగా ప్రకటించారు. కానీ పెళ్లికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. అందువల్ల వీరి వివాహం ఉదయం జరిగినా సాయంత్రం వరకు ఫొటోలు రాలేదు. ఓ ఓటీటీ ప్లాట్ఫామ్కు వీరి వివాహ ప్రసార కార్యక్రమ హక్కులను ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వీరిని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.












