
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనంద క్షణాలను వారితో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా స్వరాష్ట్రమైన కేరళకు చేరుకుని ఈ విజయాన్ని తన భార్య చారులత రమేష్తో కలిసి ఆస్వాదిస్తున్నాడు. అయితే తన క్రికెట్ కెరీర్లో ఆమె తనకు ఎలా అండగా నిలిచింది, తనకు ఎలా సపోర్ట్ను అందించింది సంజు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె గురించి ఓ పోస్టు పెట్టాడు. అలాగే ప్రపంచ కప్ టోర్నీకి ముందు కివీస్తో సొంత గడ్డపై జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తన వైఫల్యంపై కూడా అతను మీడియాకు వివరించాడు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు..
సంజూ శాంసన్ భారత జట్టును చారిత్రాత్మక మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ వైపు నడిపిస్తూ జాతీయ హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అతడు 46 బంతుల్లో అద్భుతమైన 89 పరుగులు చేసి భారత జట్టు 20 ఓవర్లలో 255/5 భారీ స్కోరు నమోదు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. టోర్నమెంట్ మొత్తం అతడు అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. గత రెండు మ్యాచ్ల్లో కూడా అర్ధశతకాలు నమోదు చేసిన శాంసన్ చివరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు.
భార్యకు ధన్యవాదాలు చెప్పిన సంజు..
టోర్నమెంట్ అనంతరం తన స్వగృహమైన తిరువనంతపురానికి చేరుకున్న శాంసన్, తన భార్య చారులత రమేష్కు అంకితంగా హృదయపూర్వక సందేశాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. తన జీవితంలోని ప్రతి ఎత్తు-పల్లాల్లో తనకు అండగా నిలిచినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. నేను నిన్ను మొదటిసారి కలిసిన రోజు నుంచి ఈరోజు వరకు నా జీవితంలో నాతోపాటు నిలిచినందుకు ఎంతో ధన్యవాదాలు. నేను ఎలా ఉన్నానో అలా నన్ను ప్రేమించినందుకు, బయట ప్రపంచానికి నేను ఎలా కనిపించినా నాతో నిజాయితీగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలోని ఉత్తమ క్షణాలను మాత్రమే కాదు, కష్టమైన క్షణాలను కూడా నువ్వు చూశావు. అయినప్పటికీ నువ్వు నా పక్కనే నిలబడ్డావు. క్రికెట్ నా జీవితంలో ఎంత ముఖ్యమో అర్థం చేసుకుని దానిని నీ జీవితంలో కూడా అంతే ముఖ్యంగా చేసినందుకు ధన్యవాదాలు.. అని శాంసన్ రాశాడు.
వరల్డ్ కప్ కోసం భిన్న ప్లాన్తో వచ్చా..
ఈ క్షణం కోసం నేను ఎంత ఆత్రుతగా కలలు కన్నానో అదే ఉత్సాహం, అదే తపనతో నువ్వు కూడా కోరుకున్నావు. ఎంతో ధన్యవాదాలు నా ప్రియమైన పొండట్టీ.. అని అతను సందేశాన్ని ముగించాడు. టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్న శాంసన్ స్వగృహానికి చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న అతనిని కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి స్వాగతించారు. తన బ్యాటింగ్ విధానంలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ శాంసన్ చిరునవ్వుతో ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. గతంలో ప్రతి బంతిని దాడి చేయాలని ప్రయత్నించి తరచూ ఔట్ అయ్యేవాడినని తెలిపాడు. ప్రతి బంతిని కొట్టాలని ప్రయత్నించేవాడిని, కానీ అది పనిచేయలేదు. ఆ విఫలతల నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో నా స్ట్రైక్ రేట్ పెంచాలని ప్రయత్నించాను, కానీ అది కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వరల్డ్ కప్ కోసం వేరే గేమ్ ప్లాన్తో సిద్ధమయ్యాను.. అని అతను తెలిపాడు.












