
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని భారత టీ20ఐ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ 2026కు జట్టులో చోటు సంపాదించినా ఫైనల్ ఎలెవెన్లో తొలుత సంజును ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. తరువాత రింకు స్థానంలో సంజును తీసుకున్నారు. కానీ సంజు తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జట్టును గెలిపించి సెమీ ఫైనల్కు వెళ్లేలా చేయడమే కాదు, సెమీ ఫైనల్లోనూ ఇంగ్లండ్పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతను టీ20లలో అద్బుతమైన కమ్ బ్యాక్ ఇచ్చాడని అంటన్నారు. అయితే ఫైనల్ మ్యాచ్కు ముందు అతను మీడియాతో మాట్లాడుతూ తాను ఫైనల్ ఎలెవన్లో చోటు సాధించేందుకు, సాధించాక ఎలా కష్టపడ్డది వివరించాడు.
దేశం కోసం ఆడాలనుకున్నా: సంజు శాంసన్
ప్రపంచకప్కు ముందు కాలం తనకు చాలా కఠినంగా గడిచిందని సంజు శాంసన్ తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్ సమయంలో తాను జట్టులో స్థానం సంపాదించాలనే ఆలోచనతో చాలా ఎక్కువగా ప్రయత్నించానని కూడా గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ అనుభవం తర్వాత ఆట పట్ల గౌరవం చూపుతూ మౌలిక అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. అది తనకు చాలా సవాలుగా అనిపించిందని, తాను దేశం కోసం ఇప్పుడు చేస్తున్నదానిలా ఆడి, జట్టుకు సహాయం చేసి, ప్రపంచకప్లో మ్యాచ్లు గెలిపించాలని అనుకున్నానని, కానీ న్యూజిలాండ్ సిరీస్ సమయంలో తాను కొంచెం ఎక్కువగా ప్రయత్నించానని అన్నాడు. జట్టుపై ప్రభావం చూపాలని, ప్రపంచకప్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు సంపాదించాలని కోరుకున్నానని, అయితే ఈ ఫార్మాట్ చాలా విచిత్రంగా ఉంటుందని అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు కూడా ఈ ఫార్మాట్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడతారని, అందుకే ఆటను గౌరవించడం అవసరం అనిపించిందని తెలిపాడు. తాను మళ్లీ తన మౌలిక అంశాలపై దృష్టి పెట్టానని, వాటిపై ఎక్కువగా పని చేశానని, ఆ కృషి చాలా బాగా ఫలించిందని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాకు దూరం..
బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి తన ఫోన్, సోషల్ మీడియాను పూర్తిగా దూరం పెట్టినట్లు శాంసన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ముందు కూడా తాను సోషల్ మీడియాను ఇప్పటికీ చూడలేదని చెప్పాడు. కష్టకాలంలో తన దగ్గర ఉన్న వారు, తనకు ఎంతో దగ్గరైన వారు, తనకు మద్దతు ఇచ్చే వారు తనతోనే ఉన్నారని, తాను అన్ని విండోలను మూసేశానని తెలిపాడు. తన ఫోన్ను కూడా ఆఫ్ చేశానని, సోషల్ మీడియాలో ఉండలేదని, ఇప్పటికీ సోషల్ మీడియాలో లేనని, అందువల్ల బయటి శబ్దం తక్కువగా ఉందని అన్నాడు. చాలా మందితో మాట్లాడడం కూడా తగ్గిందని, అది తనకు సరైన దిశలో దృష్టి పెట్టేందుకు చాలా సహాయపడిందని తెలిపాడు. తాను ప్రస్తుతం ఎలా ముందుకు సాగుతున్నానో దానిపై తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
కాగా రెండు కీలక మ్యాచ్లలో సంజు శాంసన్ ఒత్తిడిని అధిగమించి ఆడిన విధానం అద్భుతమని విశ్లేషకులు అంటున్నారు. భారత క్రికెట్జట్టు మేనేజ్ మెంట్ అసలు సంజుకు ముందు నుంచి చాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితేనేం.. ఎట్టకేలకు ఫైనల్కు చేరుకున్నారు కదా. ఇక ఈ మ్యాచ్లోనూ సంజు చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.












