అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని జ‌ట్లు ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా గువాహ‌టిలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌ను ఆడాయి.

March 31, 2026 8:28 PM
Ravindra Jadeja in RR jersey and MS Dhoni in CSK jersey during IPL 2026.
ఐపీఎల్ 2026లో తన మాజీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించిన రవీంద్ర జడేజా. Photo Credit: BCCI/X.

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని జ‌ట్లు ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా గువాహ‌టిలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌ను ఆడాయి. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం సాధించ‌గా, ఇందులో మాజీ చెన్నై ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో ఆడి 2 వికెట్లు తీశాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అయితే త‌న పాత జ‌ట్టు ఈ మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థి కావ‌డంతో జ‌డేజా కాస్త భావోద్వేగానికి గుర‌య్యాడు. కానీ తేరుకుని మ్యాచ్‌లో త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అయితే ఈ సీజ‌న్‌కు ముందు జ‌డేజా ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై నుంచి రాజ‌స్థాన్‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజా మ్యాచ్‌కు ముందు త‌న చిర‌కాల మిత్రుడు ధోనీతో మాట్లాడారా అన్న మీడియా ప్ర‌శ్న‌కు జ‌డేజా లేదు అని స‌మాధాన‌మిచ్చాడు. అయితే దీనికి కార‌ణాన్ని కూడా జ‌డేజా వెల్ల‌డించాడు.

ధోనీతో అందుక‌నే మాట్లాడ‌లేదు..

ధోనీ ఫోన్ ఉప‌యోగించే అల‌వాట్ల‌ను ప్ర‌స్తావించిన జ‌డేజా అత‌ను ఎక్కువ సమ‌యాన్ని ఫోన్‌లో గ‌డ‌ప‌డ‌ని, క్రికెట్ మ్యాచ్‌ల స‌మ‌యంలో అత‌ను సాధార‌ణంగా త‌న ఫోన్‌ను స్విచాఫ్‌లో ఉంచుతాడ‌ని తెలిపాడు. అందుకే ఈ భావోద్వేగ మ్యాచ్‌కు ముందు అత‌నితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌లేద‌ని జ‌డేజా తెలిపాడు. అయితే ధోనీ నేరుగా ఎదురు ప‌డితే మాత్రం మాట్లాడ‌తాన‌ని, ఫోన్‌లో త‌క్కువ‌గా అందుబాటులో ఉంటాడు క‌నుక మాట్లాడ‌లేన‌ని జ‌డేజా స్ప‌ష్టం చేశాడు. కాగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆడిన మ్యాచ్‌లో జ‌డేజా పింక్ క‌ల‌ర్ జెర్సీ ధరించి క‌నిపించాడు. మొద‌ట్లో జ‌డేజా రాజ‌స్థాన్‌లోనే ఉన్నాడు. త‌రువాత చెన్నైకి మారాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ త‌న సొంత గూటికి చేరాడు. అయితే చెన్నైతో జ‌రిగిన ఈ మ్యాచ్ మాత్రం జ‌డేజాకు చాలా ప్ర‌త్యేకంగా నిలిచింది.

మార్పు అనివార్యం..

జ‌డేజా 2008లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. అనంత‌రం 2012లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో చేరి ఆ జ‌ట్టుకు కీల‌క ప్లేయ‌ర్‌గా మారాడు. అయితే అంత‌టి కీల‌క ప్లేయర్‌ను చెన్నై వ‌దులుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక తాజా మ్యాచ్ అనంత‌రం కామెంటేట‌ర్ల‌తో మాట్లాడిన జ‌డేజా త‌న‌కు పింక్ క‌ల‌ర్ న‌చ్చుతుంద‌ని తెలిపాడు. యెల్లో కొంచెం పాత‌గా అనిపించ‌డం మొద‌లైంద‌ని స‌ర‌దాగా కామెంట్ చేశాడు. 12-13 ఏళ్ల పాటు కొన‌సాగిన సీఎస్‌కే లాంటి జ‌ట్టును విడిచిపెట్ట‌డం త‌న‌కు కాస్త క‌ష్టంగానే అనిపించింద‌ని, భావోద్వేగానికి గుర‌య్యాన‌ని తెలిపాడు. కానీ జీవిత ప్ర‌యాణంలో మార్పులు అనివార్య‌మ‌ని అన్నాడు. అయితే తాను మొద‌టిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జ‌ట్టులోకే తిరిగి వ‌చ్చాన‌ని, అది త‌న‌కు ఆనందాన్ని ఇస్తుంద‌ని తెలిపాడు. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత త‌న ఐపీఎల్ ప్ర‌యాణం రాజ‌స్థాన్‌లోనే ప్రారంభ‌మైంద‌ని, తొలి సీజ‌న్‌లోనే టైటిల్ గెలిచామ‌ని గుర్తు చేసుకున్నాడు. ఆ జ్ఞాప‌కాలు త‌న‌కు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మేన‌ని తెలిపాడు. ఇప్పుడు కొత్త జ‌ట్టుతో క‌లిసి నేర్చుకోవ‌డం, త‌న అనుభ‌వాన్ని పంచుకోవ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నాడు.

సీఎస్‌కే విజ‌యాల్లో కీల‌క పాత్ర‌..

కాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ 2018, 2021, 2023లో గెలిచిన ఐపీఎల్ టైటిళ్ల‌లో జ‌డేజా కీల‌క పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు అద్భుత‌మైన ఫీల్డింగ్‌తో జ‌ట్టుకు విజ‌యాలు అందించ‌డంలో అత‌ని పాత్ర ఎంతో కీల‌క‌మైంది. ర‌వీంద్ర జ‌డేజా భార‌త జ‌ట్టు త‌ర‌ఫున కూడా కీల‌క బౌలింగ్ ఆల్ రౌండ‌ర్‌గా సేవ‌లు అందించాడు. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌లో జ‌డేజా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో 2024లో టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో జ‌డేజా కూడా ఉన్నాడు. అయితే ఆ టోర్నీ గెలిచిన అనంతరం రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లితోపాటు జ‌డేజా కూడా టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఈ ముగ్గురూ కొన‌సాగుతున్నారు. ఇక ప్ర‌స్తుతం జ‌డేజా టీమిండియాకు వ‌న్డేలు, టెస్టుల్లో ఆడుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment