దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి బడ్జెట్ విపరీతంగా పెరుగుతుందంటూ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఓటీటీ మార్కెట్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మూవీకి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడవుతాయా అని నిర్మాతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్పై గత కొన్ని వారాలుగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ గ్లోబ్ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, 2027 ఏప్రిల్లో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విలువల్లో ఇటీవల గణనీయమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత వేగం అందుకుంది. రాజమౌళి ఈ ప్రాజెక్టును అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నప్పటికీ, ఓటీటీ హక్కుల మార్కెట్ విలువలు గతంతో పోలిస్తే సవరణకు లోనయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందా..?
ప్రాజెక్ట్ ప్రారంభమైన సమయంలో ఓటీటీ ఆదాయాలపై ఉన్న అంచనాలు, ప్రస్తుతం వస్తున్న ఆఫర్ల మధ్య పెద్ద వ్యత్యాసం ఉందని ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ కాకుండా వచ్చే ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవచ్చనే భావనతో నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు దర్శకుడు రాజమౌళి గానీ, చిత్ర బృందం గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ ప్రచారాలను వారు ఖండించలేదు, అలాగే ధ్రువీకరించలేదు కూడా. మరోవైపు హైదరాబాద్లో షూటింగ్ మాత్రం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు..
వారణాసి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్చైర్కు పరిమితమైన ప్రతినాయకుడు కుంభ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో అనేక భారీ విజయాలను అందించిన రాజమౌళి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, ఈ ప్రాజెక్టుపై అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బడ్జెట్పై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్పందించండి