ఎక్క‌డ చూసినా వందేభార‌త్ ట్రెయిన్ గురించే చ‌ర్చంతా.. అస‌లింత‌కీ ఆ రైలు ఎందుకంత ప్ర‌త్యేకం..? అందులో ఏముంది..?

January 19, 2023 2:56 PM

సికింద్రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు ఈ మ‌ధ్యే వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్ గా ఈ ట్రెయిన్‌ను ప్రారంభించారు. కేవ‌లం 6 చోట్ల మాత్ర‌మే ఈ ట్రెయిన్ ఆగుతుంది. ఈ క్ర‌మంలోనే వేగంగా వెళ్తుంది క‌నుక 8 గంట‌ల్లోనే గ‌మ్య‌స్థానానికి చేరుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు ఎక్క‌డ చూసినా వందే భార‌త్ రైలు గురించే చ‌ర్చంతా న‌డుస్తోంది. ఇంత‌కీ అస‌లు అందులో అంత ప్ర‌త్యేక‌త ఏముంది.. సాధార‌ణ రైళ్ల‌కు, ఈ రైలుకు మ‌ధ్య తేడాలు ఏమిటి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణ రైలుకు, వందే భార‌త్ రైలుకు మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన తేడా.. వేగం. అవును.. సాధార‌ణ సూప‌ర్ ఫాస్ట్ లేదా ఎక్స్ ప్రెస్ క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే వందే భార‌త్ రైలు ప్ర‌యాణికుల‌ను గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌గ‌ల‌దు. ఈ రైలు గంట‌కు గ‌రిష్టంగా 180 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్తుంది. కానీ మ‌న దేశంలో రైలు ప‌ట్టాలు గంట‌కు 130 కిలోమీట‌ర్ల స్పీడ్‌ను మాత్ర‌మే ఆప‌గ‌ల‌వు. క‌నుక వందే భార‌త్ రైలు కూడా ప్ర‌స్తుతం గంట‌కు 130 కిలోమీట‌ర్ల వేగంతోనే వెళ్తోంది. ఇక ఇత‌ర రైళ్ల‌తో పోలిస్తే ఈ రైలుకు ప్ర‌త్యేక ఇంజిన్ ఉండ‌దు. అందువ‌ల్ల వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే త్వ‌ర‌గా వేగం పుంజుకుంటుంది. త్వ‌ర‌గా ఆగుతుంది. క‌నుక స‌మ‌యం చాలా అవుతుంది. దీంతో ప్ర‌యాణికుల‌ను వేగంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌వ‌చ్చు. ఇది వందే భార‌త్ రైలులో ఉన్న ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త అని చెప్ప‌వ‌చ్చు.

interesting facts about vande bharat express train

ఇక ఈ రైలులో ప్ర‌యాణికుల‌కు వైఫై ద్వారా ఇంట‌ర్నెట్ స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నారు. దీనికి తోడు బ‌యో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. వీటిని ట‌చ్ చేయ‌కుండానే ఆటోమేటిగ్గా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఈ రైలు బోగీలు అన్నీ ఫుల్లీ ఆటోమేటిక్‌. రైలు ఆగ‌గానే డోర్లు తెరుచుకుంటాయి. డోర్లు మూసుకుంటేనే మళ్లీ రైలు క‌దులుతుంది. అలాగే బోగీల‌లో డిస్ ప్లేలు ఉంటాయి. వీటి ద్వారా రైలు గురించిన స‌మాచారం తెలుస్తుంది. రైలు ఎంత వేగంతో వెళ్తుంది.. ఏ స్టేష‌న్ రాబోతుంది.. ఏ స్టేష‌న్‌ను దాటేసింది.. వంటి వివ‌రాలు తెలుస్తాయి.

ఈ రైలులో రెండు క్లాస్‌ల‌లో టిక్కెట్ల‌ను అందుబాటులో ఉంచారు. ఒక‌టి ఎక‌నామిక్ క్లాస్‌. ఇంకొక‌టి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌. ఇందులో సీట్లు 360 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. ఇక ప్ర‌యాణికులు కొనే టిక్కెట్‌తోనే రైలులో తినేందుకు ఇచ్చే ఆహారం చార్జిలు కూడా వ‌సూలు చేస్తారు. టిక్కెట్ ధ‌ర‌, ఫుడ్ ధ‌ర క‌లిపే చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణికుల‌కు స‌మ‌యాన్ని బ‌ట్టి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, సాయంత్నం స్నాక్స్‌, టీ, కాఫీ, రాత్రి డిన్న‌ర్‌ను అందిస్తారు.

ఇక ఈ ట్రెయిన్‌లో ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ కోసం అణువ‌ణువునా సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే విక‌లాంగుల కోసం ప్ర‌త్యేక స‌దుపాయాల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇక ఈ ట్రెయిన్ త‌యారీకి రూ.100 కోట్ల మేర ఖ‌ర్చ‌వుతుంది. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ట్రెయిన్‌. చెన్నైలోని కోచ్ ఫ్యాక్ట‌రీలో రూపొందించారు. ఒక్కో బోగీ త‌యారీకి సుమారుగా రూ.6 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఇక ట్రెయిన్‌లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అలాగే వందే భార‌త్ రైలును ట్రెయిన్ 18 అని కూడా పిలుస్తారు. ఈ ట్రెయిన్‌ను ఎలా డిజైన్ చేశారంటే.. డ్రైవ‌ర్ క్యాబిన్‌ను కూడా చూడ‌వ‌చ్చు. అంత‌టి పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది.

రెగ్యుల‌ర్ రైళ్ల క‌న్నా ఇందులో ప్ర‌యాణికుల ల‌గేజీ కోసం ఎక్కువ స్థ‌లాన్ని అందిస్తున్నారు. ఇక ఆహారాల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు తాజాగా అందించేందుకు కూలింగ్‌, హీటింగ్ సిస్ట‌మ్‌లు ఈ రైలులో అందుబాటులో ఉన్నాయి. ఇక సీట్ల కింద ఫోన్‌, ల్యాప్‌టాప్ చార్జ‌ర్ల‌ను పెట్టుకునేందుకు ప్ర‌త్యేకంగా సాకెట్ల‌ను అందిస్తున్నారు. ఇలా వందే భార‌త్ రైలులో అనేక ప్రత్యేక‌త‌లు ఉన్నాయి. దీంతో విదేశాల్లో రైళ్ల‌లో ప్ర‌యాణించిన అనుభూతి ప్ర‌యాణికుల‌కు క‌లుగుతుంది. అయితే రైలు ప‌ట్టాల‌ను ఇంకా ఆధునీక‌రిస్తే.. అప్పుడు గ‌రిష్ట వేగం (180)తో ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీంతో ఇంకా త్వ‌ర‌గానే గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవచ్చు. అప్పుడు స‌మ‌యం మ‌రింత ఆదా అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment