Rosaiah : ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య ఇక‌లేరు

December 4, 2021 12:56 PM

Rosaiah : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య క‌న్నుమూశారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న‌కు కార్డియాక్ స్ట్రోక్ రావ‌డంతో వెంట‌నే ప‌ల్స్ లెవ‌ల్స్ ప‌డిపోయాయి. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తుండగా.. మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందారు. ఆయ‌న బీపీ స‌డెన్‌గా ప‌డిపోయింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. రోశ‌య్య వ‌య‌స్సు 88 సంవ‌త్స‌రాలు.

హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట‌లో ఆయ‌న నివాసం ఉంటున్నారు. ఆయ‌న‌కు అస్వ‌స్థ‌త క‌ల‌గ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆయ‌న మృతి చెందార‌ని వైద్యులు తెలిపారు.

ఈ క్ర‌మంలోనే రోశ‌య్య పార్థివ దేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువ‌చ్చారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న పార్టీ నాయ‌కులు, బంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయ‌న‌కు చివ‌రి వీడ్కోలు ప‌లికేందుకు భారీగా ఆయ‌న ఇంటి వ‌వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

ex chief minister konijeti Rosaiah is no more

కాగా రోశ‌య్య జూలై 4, 1933వ సంవ‌త్స‌రంలో గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ఏపీ రాజ‌కీయాల్లో గ‌త 6 ద‌శాబ్దాలుగా ఆయ‌న క్రియాశీల‌కంగా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని హిందూ కాలేజీలో రోశ‌య్య కామ‌ర్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. త‌రువాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1968, 1974, 1980ల‌లో ఆయ‌న శాస‌న మండ‌లి స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. మ‌ర్రి చెన్నారెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. త‌రువాత ప‌లు భిన్న మంత్రిత్వ శాఖ‌ల్లో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

2004లో ఆయ‌న చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌య్యారు. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2009లో ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. మ‌రోమారు శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు. త‌రువాత సెప్టెంబ‌ర్ 2, 2009న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం రోశ‌య్య ఉమ్మ‌డి ఏపీ సీఎం అయ్యారు. న‌వంబ‌ర్ 4, 2010 వ‌ర‌కు సీఎం ప‌దవిలో ఉన్నారు.

ఆ త‌రువాత రోశ‌య్య ఆగ‌స్టు 31, 2011 నుంచి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. క‌ర్ణాట‌క ఇన్‌చార్జి గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లందించారు. ఆగ‌స్టు 30, 2016 వ‌ర‌కు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా రోశయ్య ఉన్నారు. ఆ త‌రువాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అడ‌పా ద‌డ‌పా ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న క‌నిపిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు ఇప్ప‌టికే రోశ‌య్య మృతి ప‌ట్ల త‌మ ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 4, 5, 6 తేదీల‌ను సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 5న హైద‌రాబాద్‌లోని కొంప‌ల్లిలో ఉన్న సొంత ఫామ్ హౌస్‌లో మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now