Cinema : బాబ్బాబు.. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు.. సినిమా చూడండి ప్లీజ్‌..!

May 21, 2022 3:26 PM

Cinema : నిన్న మొన్న‌టి వ‌ర‌కు థియేట‌ర్ల‌లో సినిమాలను విడుద‌ల చేశాక మొద‌టి 7 నుంచి 10 రోజుల వ‌ర‌కు భారీగా టిక్కెట్ల రేట్ల‌ను పెంచి ముక్కు పిండి మ‌రీ ప్రేక్ష‌క‌ల వ‌ద్ద డ‌బ్బులు వ‌సూలు చేశారు. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఆర్ఆర్ఆర్ ఒక్క‌టి త‌ప్పించి.. రాధేశ్యామ్‌, ఆచార్య, స‌ర్కారు వారి పాట వంటి మూవీల‌కు తొలి రోజే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు స‌రిగ్గా క‌నిపించ‌లేదు. గతంలో పెద్ద సినిమాలు వ‌స్తే తొలి మూడు, నాలుగు రోజుల వ‌ర‌కు అస‌లు థియేట‌ర్ల‌లో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఉండేవారు. అస‌లు టిక్కెట్లు దొరికేవి కావు. కానీ ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్న‌మైన ప‌రిస్థితి నెలకొంది. థియేట‌ర్ల‌లో చాలా వ‌ర‌కు తొలి రోజే సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. అయితే ఇందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలను మ‌నం చెప్పుకోవచ్చు.

క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీల‌కు జ‌నాలు బాగా అల‌వాటు ప‌డ్డారు. కొత్త సినిమాను నెల రోజుల్లోనే ఓటీటీల్లో చూస్తున్నారు. క‌నుక థియేట‌ర్ల‌కు వెళ్లాలంటే ఆస‌క్తిని చూపించ‌డం లేదు. అలాగే టిక్కెట్ల రేట్లు. మొద‌టి వారం ప‌ది రోజులు ఎలాగూ ఎక్కువ‌గానే ఉంటాయి. త‌రువాత ఇంకో 15-20 రోజులు ఓపిక ప‌డితే నేరుగా ఓటీటీలోనే చూడ‌వ‌చ్చు. అంత‌మాత్రానికి అంత టిక్కెట్ ధ‌ర పెట్ట‌డం ఎందుక‌ని చాలా మంది ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. క‌నుక‌నే థియేట‌ర్ల‌లో తొలి రోజు సైతం అనేక చోట్ల సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. అయితే టిక్కెట్ల రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌కు వ్యూహం బెడిసికొట్టింది. అధికంగా ధ‌ర‌లు పెంచేస్తే జ‌నాలు వ‌చ్చి చూస్తార‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. జ‌నాలు థియేట‌ర్ల‌కు రాలేదు. దీంతో టిక్కెట్ల రేట్ల‌ను పెంచ‌డం అనే వ్యూహం విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఇక‌పై రిలీజ్ అవ‌నున్న సినిమాల‌కు గాను టిక్కెట్ల రేట్ల‌ను పెంచ‌డం లేదు.. అనే యాడ్ ను కూడా ప్ర‌మోష‌న్‌ల‌లో ఇవ్వాల్సి వ‌స్తోంది. అందుకు ఎఫ్3 మూవీనే ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు.

Cinema makers facing problems over ticket prices
Cinema

సాధార‌ణంగా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.150 వ‌ర‌కు టిక్కెట్ ధ‌ర ఉంటుంది. ఇంట‌ర్నెట్ ద్వారా బుక్ చేస్తే ఇంకో రూ.20 నుంచి రూ.30 అద‌నం. అలాగే మ‌ల్టీప్లెక్సుల‌లో టిక్కెట్ ధ‌ర రూ.200కు పైగా ఉంటుంది. బుకింగ్ అన్నీ క‌లిపి రూ.250 వ‌ర‌కు అవుతుంది. ఇవి సాధార‌ణ ధ‌ర‌లే. అయిన‌ప్ప‌టికీ ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గానికి చెందిన కుటుంబం సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌లో సినిమా చూసినా.. న‌లుగురు ఉంటే దాదాపుగా రూ.800 వ‌ర‌కు అవుతుంది. ఇత‌ర చార్జిలు క‌లిపితే రూ.1000 అవుతుంది. అంటే.. ఇది వారి నెల‌వారి బ‌డ్జెట్‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌మాట‌. ఈ ఖ‌ర్చుతో నెల‌కు పాలు లేదా కూర‌గాయ‌ల బిల్లు ఎగిరిపోతుంది. క‌నుక ఒక కుటుంబం మొత్తం క‌ల‌సి నెల‌కు ఒక్క సినిమా చూడాల‌న్నా ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే అందులో స‌గం మొత్తం చెల్లించి ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ తీసుకుంటే ఏడాది వ‌ర‌కు వ‌స్తుంది. క‌నుక వారం వారం కొత్త సినిమాలు చూడ‌వ‌చ్చు. దీంతో చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే కొత్త సినిమాల‌ను చూసిన‌ట్లు ఉంటుంది. కాక‌పోతే కొద్ది రోజులు ముందు.. వెనుక‌.. అంతే.. క‌నుక‌నే స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేశాడు.

ఇక ప్ర‌స్తుతం పైన చెప్పిన లాంటి ప‌రిస్థితి ఉంది క‌నుక‌నే.. టిక్కెట్ల రేట్ల‌ను పెంచితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావిస్తున్న నిర్మాత‌లు రేట్ల‌ను పెంచ‌డం లేద‌ని సినిమా పోస్ట‌ర్‌ల‌పైనే యాడ్స్‌ను ప్రింట్ చేస్తూ ప్ర‌మోష‌న్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఎఫ్3 మూవీకి ఇలాగే యాడ్స్ ఇస్తున్నారు. సాధార‌ణ టిక్కెట్ ధ‌ర‌ల‌తోనే సినిమా విడుద‌ల‌వుతుంద‌ని.. అంద‌రూ చూడాల‌ని.. కోరుతూ యాడ్స్ ఇస్తున్నారు. దీనికి బాబ్బాబు.. రేట్లు పెంచ‌లేదు.. సినిమా చూడండి.. ప్లీజ్ అనే ట్యాగ్ లైన్‌ను త‌గిలించ‌డం ఒక్క‌టే త‌రువాయి. దాదాపుగా ప్రేక్ష‌కుల‌ను యాచించాల్సిన ప‌రిస్థితి సినీ రంగానికి చెందిన వారికి ఏర్ప‌డింది. అంటే ప‌రిస్థితి ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు ఉన్న సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్ల‌ను అమ్మినా.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా.. అంటే.. అందుకు స‌మాధానం చెప్ప‌లేం. కానీ ఇంకాస్త త‌గ్గిస్తే ప్రేక్ష‌కులు మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నీసం అలాగైనా మ‌ళ్లీ నెమ్మ‌దిగా పుంజుకోవ‌చ్చు. లేదంటే ముందు ముందు ప‌రిస్థితులు ఇంకా దిగ‌జారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి సినీ పెద్ద‌లు ఈ దిశ‌గా ఆలోచిస్తారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now