
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి నటి త్రిష కృష్ణన్ హాజరవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ముందుగానే చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ లుకింగ్ ఫార్వార్డ్ అని స్పందించిన వీడియో వైరల్గా మారింది. త్రిష తన తల్లి ఉమా కృష్ణన్ తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐస్-బ్లూ సిల్క్ కాంజీవరం చీరలో, జాస్మిన్ పూలతో అలంకరించిన హెయిర్ స్టైల్తో ఆమె ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. గోల్డెన్ బోర్డర్ చీర, డైమండ్-రూబీ చోకర్ సెట్, మినిమల్ మేకప్తో ఆమె లుక్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
విజయ్ కుటుంబ సభ్యులను పలకరింపు..
ప్రమాణ స్వీకార వేదిక వద్ద విజయ్ కుటుంబ సభ్యులను త్రిష ఆత్మీయంగా పలకరించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె విజయ్ కుటుంబ సభ్యులను హగ్ చేసుకోండం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. విజయ్ రాజకీయ ప్రస్థానానికి త్రిష మద్దతు ఇస్తున్నారనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఆమె తిరుపతి దేవాలయానికి వెళ్లడం, తరువాత విజయ్ నివాసానికి వెళ్లడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఎన్నికల సమయంలో ఓటు వేసిన తర్వాత ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టులో గిల్లి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించడం కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది. త్రిష, విజయ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. వీరిద్దరూ కలిసి గిల్లి, తిరుప్పాచి, ఆతి, కురువి, లియో తదితర చిత్రాల్లో నటించారు. వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సంగీత హాజరు కాలేదా..?
ఈ కార్యక్రమానికి సంబంధించి మరో అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ భార్య సంగీత, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో త్రిష హాజరవడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే విజయ్ లేదా త్రిష ఈ వ్యక్తిగత ప్రచారాలపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తమిళనాడులో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

స్పందించండి