
నటి తమన్నా భాటియా అనుకోకుండా ఓ రాజకీయ వివాదం మధ్యలో నిలిచారు. దీనికి కారణం ఒక సబ్బు బ్రాండ్ కావడం విశేషం. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) సంస్థ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ సంస్థ తయారు చేసే మైసూర్ సాండల్ సోప్ కర్ణాటకకు గర్వకారణంగా భావించబడే వారసత్వ బ్రాండ్. రాష్ట్ర ప్రజల్లో దీనికి గట్టి భావోద్వేగ విలువ కూడా ఉంది. అయితే తమన్నా నియామకం కొన్ని వర్గాల నుంచి విమర్శలకు దారితీసింది. కర్ణాటక గుర్తింపుతో అంతగా ముడిపడిన ఒక బ్రాండ్కు ముంబైకి చెందిన నటిని ఎందుకు ఎంపిక చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్పత్తికి కన్నడ నటినే ముఖచిత్రంగా తీసుకోవాల్సిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
పాన్ ఇండియా స్థాయి నటీమణులు ఉండగా తమన్నా ఎందుకు..?
కాగా తమన్నా భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు. పలు భాషల చిత్రాల్లో ఆమెకు బలమైన గుర్తింపు ఉంది. పూర్తి స్థాయి కన్నడ చిత్రంలో ఆమె నటించకపోయినా KGF: Chapter 1, జాగ్వార్ వంటి కన్నడ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించారు. అయితే కర్ణాటక నుంచి పలువురు పాన్-ఇండియా స్థాయి నటీమణులు ఉన్నారని, వారిని తీసుకోకుండా తమన్నాను ఎందుకు ఎంపిక చేశారని పలువురు వాదిస్తున్నారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, రుక్మిణి వసంత్, దీపికా పదుకొణె, శ్రీనిధి శెట్టి, అనుష్క శెట్టి వంటి పేర్లను వారు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.
వివాదం కొనసాగుతుందా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్న రుక్మిణి వసంత్, రష్మిక మందన్న వంటి ఎదుగుతున్న కన్నడ నటీమణులు కర్ణాటక గర్వాన్ని ప్రతిబింబించే ఈ వారసత్వ బ్రాండ్కు మరింత సరైన ఎంపిక అయ్యేవారని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు ప్రాంతీయ ప్రాతినిధ్యం, బ్రాండ్ గుర్తింపు వంటి అంశాలపై విస్తృత చర్చకు దారి తీసింది. దీంతో తమన్నా భాటియా అనుకోకుండా వివాదం మధ్య ఇరుక్కున్నారు. అయితే దీనిపై ఆమె స్పందిస్తారా, కర్ణాటక ప్రభుత్వం ఆమెను అలాగే కొనసాగిస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.








