
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సెలబ్రిటీలు సైతం ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా దర్శకుడు మారుతి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో చాలా రోజుల పాటు మీడియాకు మారుతి కనిపించలేదు. కానీ తాజాగా సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ఆయన అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూనే తన తదుపరి మూవీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.
స్ర్కిప్ట్ చివరి దశలో ఉంది: మారుతి
ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ప్రభాస్ రాజాసాబ్ మూవీ దారుణంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్స్ను చూసి అభిమానులు దర్శకుడు మారుతి మాటలను నమ్మి థియేటర్లకు వెళ్లారు. సినిమాపై బోలెడు హైప్, ఆశలతో చూసేందుకు వెళ్లినా, తీరా సినిమా చూశాక దారుణంగా మోసపోయినట్లు వారు తెలిపారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండగా, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, హెడ్ మార్ఫింగ్ వంటివి మరీ అధికంగా వాడే సరికి సినిమా డిజాస్టర్గా నిలిచింది. ప్రేక్షకులకు అసలు సినిమాలో ఏ పార్ట్ కూడా నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతిని విమర్శిస్తూనే ఉన్నారు. ఆ దెబ్బకు మారుతి గత కొన్నాళ్లుగా బయట కనిపించలేదు. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతూ తన నెక్ట్స్ మూవీ గురించి చెప్పారు. మూవీ వివరాలను వెల్లడించలేదు కానీ తన తరువాతి సినిమాకు చెందిన స్ర్కిప్ట్ చివరి దశలో ఉందని, త్వరలో వివరాలను వెల్లడిస్తానని, తన సినిమాకు రాముడి ఆశీస్సులు ఉన్నాయని పోస్టులో పేర్కొన్నారు.
Every journey is a learning experience. On this auspicious occasion of #SriRamaNavami, I’m grateful to be giving final touches to my next script with His blessings 🙏
A heartfelt thank you to all my audience, well-wishers and the media for constantly supporting me and sharing… pic.twitter.com/TXGf0rpGSk
— Director Maruthi (@DirectorMaruthi) March 27, 2026
రాజాసాబ్ ఫెయిల్యూర్ను అంగీకరించారా..?
రాజాసాబ్ ఫ్లాప్ అవడంపైనా మారుతి పరోక్షంగా స్పందించారు. జీవితంలో ప్రతి ప్రయాణం ఒక అనువభమే అని అన్నారు. అయితే రాజాసాబ్ ఇచ్చిన ఫెయిల్యూర్ గురించే ఆయన అలా పోస్టు పెట్టి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ మీడియా, సన్నిహితులు, ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే మారుతి చాన్నాళ్లకు ఈ పోస్టు పెట్టి బయటి ప్రపంచానికి కనిపించడంతో ఆయన రాజాసాబ్ దెబ్బ నుంచి కోలుకున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇక తన తరువాతి చిత్రానికి హ్యాపీ పొంగల్ అనే టైటిల్ను ఫిక్స్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే వైష్ణవ్ తేజ్తో ఆయన ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని కూడా సమాచారం. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అయితే తన నెక్ట్స్ చిత్రంతో హిట్ కొట్టాలని, లేదంటే ఆయన పని అయిపోయినట్లేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












