
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వరుసగా సెంచరీలతో బాక్సాఫీస్ను కుదిపేస్తూ, ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం దేశంలో రూ.411.12 కోట్ల వసూళ్లను దాటింది. ఈ చిత్రంపై సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సినిమాను విమర్శిస్తున్న వారిపై ఆమె పరోక్షంగా సెటైర్లు వేశారు.
ఇది అద్బుతమైన సినిమా: జయప్రద
తాజాగా మీడియాతో జయప్రద మాట్లాడుతూ ఇది అద్భుతమైన సినిమా అని, చాలా సంవత్సరాల తర్వాత ప్రజలు చూసే చిత్రమని అన్నారు. ఈ చిత్రంపై తనకు ఎంతో గర్వంగా ఉందని, చెడు మాటలు చెప్పడం చాలా సులభమని, కానీ వారు చేసిన కష్టం చూడండని, వారు ఎలా పనిచేశారు, కథ ఎలా రాశారు చూడాలని, అందరు నటులు కలిసి ఈ సినిమాను విజయవంతం చేశారని అన్నారు. అందరూ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
తొలి రోజు రూ.102.55 కోట్లు..
కాగా ఆదివారం (మార్చి 22, 2026) రోజున ధురంధర్ 2 (హిందీ) దేశీయ వసూళ్లకు రూ. 107 కోట్లు జోడించగా, కన్నడ, మలయాళ వెర్షన్లు వరుసగా రూ. 0.01 కోటి, రూ. 0.09 కోట్లు సాధించాయని సాక్నిల్క్ నివేదిక తెలిపింది. తమిళ, తెలుగు వెర్షన్లు వరుసగా రూ. 2.50 కోట్లు, రూ. 5.25 కోట్లు వసూలు చేసి, చిత్రానికి అదనపు ఊపు ఇచ్చాయి. విస్తరించిన వీకెండ్ను పూర్తి స్థాయిలో వినియోగించుకున్న ధురంధర్ 2 మార్చి 19న రూ. 102.55 కోట్లతో తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం మార్చి 20న రూ. 80.72 కోట్లు, మార్చి 21న రూ. 113 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా, వీకెండ్లో వరుసగా సెంచరీలు సాధిస్తూ ఈ చిత్రం తన దూకుడును కొనసాగించింది.
భారీ ఆధిక్యంతో ముందంజలో..
మార్చి 19న దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి 21,633 షోలు కేటాయించగా, ఆదివారం రోజున షోల సంఖ్య స్వల్పంగా తగ్గి 21,202కు చేరింది. తాజా హిందీ బ్లాక్బస్టర్ల బాక్సాఫీస్ రికార్డులతో పోలిస్తే, ధురంధర్ 2 భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ (2023) మొదటి రోజున రూ. 63 కోట్లు వసూలు చేయగా, షారుక్ ఖాన్ జవాన్ (2023) రూ. 65 కోట్లు సాధించింది.












