
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా ఆయన అదే విధంగా కొనసాగుతాడని, ప్రతికూల పరిస్థితుల్లో మానవులు విజయం సాధించగలరని ఆయన మనకు తెలియజేశాడని అన్నారు. కరుణ, ధైర్యం, నీతి, క్షమ వంటి విలువలకు ఆయన ప్రతీక అని, ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారని, అంటే ఆదర్శ వ్యక్తి అని రణబీర్ కపూర్ కొనియాడారు. రామాయణం పార్ట్ 1 చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాన్ని అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో నిర్వహించగా, అందులో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. రామాయణం మూవీలో రాముడి పాత్ర గురించి ఆయన అక్కడి అభిమానులకు పరిచయం చేశారు.
రాముడి పాత్రను పరిచయం..
ఈ ఏడాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న హిందీ చిత్రాల్లో ఒకటైన రామాయణం పార్ట్ 1 దీపావళికి విడుదల కానుంది. నితేష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో (రాముడిగా) నటిస్తున్నారు. సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గత జూలైలో చిత్ర బృందం ఒక అనౌన్స్మెంట్ స్నీక్-పీక్ వీడియోను విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించే ఫస్ట్ లుక్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ గ్రాండ్ లాంచ్కు ముందు చిత్ర బృందం లాస్ ఏంజెల్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రణబీర్ కపూర్ లాస్ ఏంజెల్స్లోని ప్రేక్షకులకు తన రాముడి పాత్రను భావోద్వేగంగా పరిచయం చేశారు.
#RanbirKapoor at #Ramayana Event :
Lord Ram has been the conscience keeper of billions of people around the globe for centuries and he will continue being so even a long after we’ve gone.
He enlightens us about the triumph of the human spirit in terms of adversities. He… pic.twitter.com/z4B9IpbeZB
— KBP Reviews🏹 (@KshitizCritic) March 31, 2026
ఏప్రిల్ 2న ఫస్ట్ లుక్..
రామాయణం సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2, 2026న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే శ్రీరామనవమి నాడు ప్రకటించింది. ఆ కార్యక్రమంలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ ఈ కథ మనందరిదని, దీన్ని అత్యంత నిజాయితీ, భక్తి, బాధ్యతతో జీవితంలోకి తీసుకురావడానికి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా రామ అనే తదుపరి దృశ్యాన్ని విడుదల చేయడానికి ఎదురు చూస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని జరుపుకోబోతున్నామని, ప్రేక్షకుల ప్రేమ, నమ్మకం, సహనానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
అంతర్జాతీయ స్థాయి నిపుణులతో..
కాగా రణబీర్ కపూర్తో పాటు ఈ చిత్రంలో యశ్ రాక్షసరాజు రావణుడిగా నటిస్తున్నారు. సాయి పల్లవి సీతాదేవిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. టెక్నికల్ పరంగా కూడా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయి నిపుణులను నియమించుకుంది. ఆస్కార్ అవార్డు గ్రహీతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్ యాక్షన్ను పర్యవేక్షిస్తున్నారు. అవెంజర్స్ చిత్రాలకు పని చేసిన టెర్రీ నోటరీ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో విడుదల కానున్నాయి.












