
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతుందని నిర్మాతలు ఆరోపించడం సరికాదని, వారు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని తాప్సీ తెలిపింది. చిత్ర పరిశ్రమంలో నటీనటులు, వారి వెంట వచ్చే సపోర్ట్ స్టాఫ్కు నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుందని ఇటీవల కొందరు నిర్మాతలు వ్యాఖ్యానించగా ఇప్పుడీ విషయం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయంపై స్పందించిన తాప్సీ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించింది. తాను ఎంతో మంది అగ్ర నటీనటులతో కలసి పనిచేశానని, కొందరికి సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువ సంఖ్యలో లేరని, అందువల్ల నిర్మాతలు ఆరోపిస్తున్న విషయాల్లో నిజం లేదని తాప్సీ తెలిపింది.
నిర్మాతలు చెబుతున్న దాంట్లో నిజం లేదు: తాప్సీ
ఇటీవలి కాలంలో తాప్సీ స్నేహితుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. అయితే తాప్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అగ్ర నటీనటులకు ఉండే సపోర్టింగ్ స్టాఫ్ వల్ల నిర్మాతలకు ఖర్చు పెరుగుతుందనే విషయం ప్రచారంలో ఉందని, అది తప్పు అని తాప్సీ తెలిపింది. తాను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటులతో కలసి పనిచేశానని, షూటింగ్ సమయాల్లో వారికి సపోర్ట్ స్టాఫ్ పెద్దగా లేరని, అందువల్ల నిర్మాతలకు ఖర్చు పెరుగుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటీవల కొందరు నిర్మాతలు ఇచ్చిన ఇంటర్వ్యూలను తాను చూశానని, నటీనటులతో పనిచేయడం వల్ల వారికి ఖర్చులు పెరుగుతాయని వారు ఫిర్యాదు చేస్తున్నారని, ముఖ్యంగా స్టార్ నటులకు ఉండే సపోర్టింగ్ స్టాఫ్ ఖర్చులపై చాలా వాడి వేడి చర్చ జరిగిందని ఆమె తెలిపింది.
నిర్మాతలే అలా చేస్తున్నారు..
కొందరు నిర్మాతలు ఆరోపిస్తున్నట్లు ఆ విషయం నిజం కాదని తాప్సీ స్పష్టం చేసింది. ప్రతి స్టార్ అలా చేయరని, తాను పరిశ్రమలో ఇద్దరు స్టార్ నటులైన షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్తో పనిచేశానని, అమితాబ్తోనూ నటించానని, కానీ వారి వెంట భారీ స్థాయిలో స్టాఫ్ ను చూడలేదని తెలిపింది. స్టార్ నటుల వెంట భారీ స్టాఫ్ ఉంటారని అనుకోవడం అపోహ మాత్రమేనని పేర్కొంది. అయితే కొందరు నటులకు భారీ స్టాఫ్ ఉండడం కరెక్టే కానీ అందరికీ అది వర్తించదని ఆమె తెలిపింది. కానీ నిర్మాతలే అలా భారీ స్టాఫ్ ఉండే నటులకు అవకాశాలు ఇస్తున్నారని, అలాంటప్పుడు మళ్లీ ఖర్చు పెరుగుతుందని ఫిర్యాదు చేయడం ఎందుకని తాప్సీ ప్రశ్నించింది. కాగా తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి.
దక్షిణాది పరిశ్రమపై కూడా వ్యాఖ్యలు..
ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వో లడ్కీ హై కహా అనే మూవీతోపాటు గాంధారి అనే సినిమాలోనూ ఆమె యాక్ట్ చేస్తోంది. ఇటీవలే ఆమె నటించిన అస్సీ అనే చిత్రం హిందీలో విడుదల కాగా అందులో ఆమె న్యాయవాది రావి పాత్రలో నటించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనే లభించింది. అయితే ఈ మధ్య కాలంలో తాప్సీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇటీవల మాట్లాడుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో సినీ ప్రేక్షకులు ఫైరయ్యారు. ఆమె ముందుగా ఆ పరిశ్రమ ద్వారానే సినిమా రంగంలోకి వచ్చిందని, అలాంటిది ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చాలా మంది అభిప్రాయపడ్డారు.












