
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రధాన కథానాయికగా అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతన్నారు. ట్రెండ్స్ మారుతున్నా, వయస్సు అనే అడ్డంకిని లెక్కచేయకుండా ప్రియమణి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే పలు భాషల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియమణి, తాజాగా మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ కు సంతకం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఆమె అందుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ హై ప్రొఫైల్ సినిమాకు ఆమెకు రూ.1 కోటి కంటే ఎక్కువగా అందిస్తున్నారని సమాచారం.
చిరంజీవికి జోడిగా..?
ఇండియా డైలీ లైవ్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ప్రియమణి నేరుగా చిరంజీవి సరసన నటించన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్తో గతంలో బ్లాక్బస్టర్ హిట్ అందించిన బాబీ మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కీలకమైన మహిళా పాత్ర ఉండగా, ఆ పాత్రకు ప్రియమణిని ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్కు భారీ విజయం అందించిన బాబీ, ఈసారి కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను అలరించే కథతో రాబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా చిరంజీవి సరసన నటించిన తాజా హీరోయిన్లలో తమన్నా, నయనతార, త్రిష వంటి గ్లామర్ ఇమేజ్ ఉన్న నటీమణులు ఉన్నారు. అలాంటి నేపథ్యంలో, ఆ వర్గానికి చెందకపోయినా ప్రియమణికి ఇంత భారీ పారితోషికం లభించడం ఆమె మార్కెట్ విలువకు నిదర్శనంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.








