
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సందీప్ గుణ్ణం, వినయ చిలకపాటి సంయుక్తంగా తొలిసారిగా ఈ చిత్ర నిర్మాణం ద్వారా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సందీప్కు ఎన్టీఆర్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న కారణంగానే ఆయనతో ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేయించారని తెలుస్తోంది. తన స్నేహితుడి తొలి నిర్మాణాన్ని ఎన్టీఆర్ కూడా ప్రశంసించారు. కథ ప్రత్యేకంగా ఉందని, ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మేకర్స్ పంచుకున్నారు.
పోలీస్ అధికారి పాత్రలో..
ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. క్రైమ్ బ్యూరో పోస్టింగ్ నిరాకరించబడిన తరువాత ఓ భయానక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం ప్రారంభిస్తాడు. పిల్లలతో సంబంధం ఉన్న గూఢచర్య సంకేతాలు, ఉత్కంఠభరిత చేజ్ సన్నివేశాలు చిత్ర కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. చివర్లో భావోద్వేగ మలుపుతో ఈ చిత్రం ముగుస్తుందని మేకర్స్ తెలిపారు. ఇందులో పరిశోధనాత్మక డ్రామా సన్నివేశాలను, భావోద్వేగ అంశాలను మేళవించామని తెలిపారు.
మృత్యుంజయ్ సినిమాకు హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో రెబా మోనికా జాన్ ఓ పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆమెకు శ్రీవిష్ణుతో రెండో సినిమా కావడం విశేషం. కాల భైరవ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఎంఎం కీరవాణి కుమారుడు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, రామ్ పోతినేని తదితర సినీ ప్రముఖులు సపోర్ట్ను ఇచ్చారు. కాగా మృత్యుంజయ్ చిత్రం మార్చి 6, 2026న రిలీజ్కు సిద్ధమవుతోంది.












