
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత మాజీ ఆఫ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఇషాన్ కిషన్ నాయకత్వం కొనసాగిస్తేనే సన్ రైజర్స్ మరిన్ని విజయాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కిషన్ కెప్టెన్గా కొనసాగడం జట్టుకు మేలు చేస్తుందని అన్నారు. ఈ సీజన్లో కిషన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ జట్టు ఏడు మ్యాచ్లలో నాలుగు విజయాలు నమోదు చేసింది. తాజాగా హైదరాబాద్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ఇక నడుము గాయంతో ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరమైన కమిన్స్ ఇప్పుడు జట్టుతో మళ్లీ చేరగా, అతను తదుపరి మ్యాచ్లలో ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హర్భజన్ ఆ వ్యాఖ్యలు చేశారు. ప్యాట్ కమిన్స్ వచ్చినప్పటికీ అతన్ని ఒక ప్లేయర్గానే తీసుకోవాలని, కెప్టెన్గా కిషన్నే కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంజయ్ బంగర్ సైతం కిషన్కే మద్దతు..
అయితే ఇది చర్చనీయాంశమే అయినా ఒక యువ నాయకుడికి జట్టు మద్దతు ఇచ్చినప్పుడు అతనితో కొనసాగితేనే బాగుంటుందని హర్భజన్ అన్నారు. 2024లో కమిన్స్ జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే అది వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం కిషన్ నాయకత్వంలో జట్టు బాగానే ఆడుతుందని, బౌలర్లు, ఇతర ఆటగాళ్లు అతనితో మంచి సమన్వయం సాధించారని, కిషన్ను కెప్టెన్గా ఉంచడం జట్టుకు ఉపయోగపడుతుందని వివరించారు. కాగా అంతకుముందు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా కిషన్కు మద్దతు తెలిపారు. ఈ సీజన్లో అతని టాక్టికల్ అవగాహన, ప్రశాంత నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఇషాన్ కిషన్ ఒక నాయకుడిగా బౌలర్లను ఎలా ఉపయోగించాలో బాగా అర్థం చేసుకుంటాడని, ఏ బ్యాటర్కు ఏ బౌలర్ సరిపోతాడో అతనికి స్పష్టంగా తెలుసని అన్నారు. ఆటను ఎలా నియంత్రించాలో అతని విధానం స్పష్టంగా కనిపిస్తోందని, అతను ఎక్కడా ఆతురత చూపించడం లేదని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని బంగర్ పేర్కొన్నారు.
ప్రారంభం బాగా లేకున్నా..
కాగా కిషన్ నాయకత్వంలో సీజన్ ప్రారంభం సన్రైజర్స్ కు అంత సానుకూలంగా నిలవలేదు. తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. అయితే తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ పై 65 పరుగుల భారీ విజయం సాధించింది. అనంతరం లక్నో సూపర్ జయాంట్స్, పంజాబ్ కింగ్స్ చేతుల్లో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. మొదటి నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించిన సన్రైజర్స్ జట్టు తర్వాత గట్టిగా పుంజుకుని వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. జట్టు నెట్ రన్ రేట్ కూడా +0.820గా సానుకూలంగా ఉంది. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే యువ నాయకత్వంపై సన్రైజర్స్ పెట్టుకున్న నమ్మకం ఫలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తరువాతి మ్యాచ్లలో కిషన్ను కెప్టెన్గా కొనసాగిస్తారా, లేక కమిన్స్కు పగ్గాలు అప్పగిస్తారా అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.












