
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు చెందిన ఈ టీ20 లీగ్ జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగి, ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముగిసేది. దీంతో షెడ్యూల్లో ఎలాంటి ఘర్షణ ఉండేది కాదు. అయితే గతేడాది నుంచి రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతుండడంతో విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ను మధ్యలో వదిలి ఐపీఎల్లో చేరే పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్లో పలు జట్లకు చెందిన కీలక విదేశీ ప్లేయర్లు గాయాలతో దూరం కావడంతో వారి రీప్లేస్మెంట్ కింద పీఎస్ఎల్లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీసుకుంటున్నాయి. గతేడాది అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిక్కు తోచని స్థితిలో ఆయోమయంతో గందరగోళంలో పడింది.
2025 నుంచే సమస్య మొదలు..
ఈ సమస్య మొదటగా 2025లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బోష్.. లిజాద్ విలియమ్స్కు బదులుగా ముంబై ఇండియన్స్లో చేరేందుకు పేశావర్ జల్మీ జట్టును విడిచిపెట్టాడు. ఈ నిర్ణయం కారణంగా అతనిపై పీఎస్ఎల్ ఒక సంవత్సర నిషేధం విధించింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి-మార్చి మధ్య జరగడంతో, పీఎస్ఎల్ మళ్లీ మార్చి-ఏప్రిల్ షెడ్యూల్కు మారింది. దీంతో మరింత మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ను ఎంచుకుంటూ పీఎస్ఎల్ నుంచి తప్పుకుంటున్నారు. జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబాని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్కు బదులుగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. మొదటగా ముజరబానిని వెస్టిండీస్ పేసర్ షమార్ జోసెఫ్కు బదులుగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టులో తీసుకున్నప్పటికీ, ఆ జింబాబ్వే ఆటగాడు పీఎస్ఎల్ కు బదులుగా ఐపీఎల్ను ఎంచుకుని కోల్కతా జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
బ్లెస్సింగ్ ముజరబాని, దసున్ షనాకా..
ముజరబానితోపాటు శ్రీలంక కెప్టెన్, ఆల్రౌండర్ దసున్ షనాకా కూడా గాయపడిన సామ్ కరన్కు బదులుగా రాబోయే ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పీఎస్ఎల్ ఫ్రాంచైజీ లాహోర్ కలందర్స్కు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ మార్పుకు సంబంధించిన ప్రక్రియలు పూర్తి చేసే దశలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ప్రీ-ఆక్షన్ ట్రేడ్లో సామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఒప్పందంలో సీఎస్కే సంజూ శాంసన్ను పొందగా, ఆర్ఆర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్లను సొంతం చేసుకుంది. అయితే గ్రోయిన్ గాయం గాయం కారణంగా సామ్ కరన్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.
ఈ ఏడాది కూడా అలాగే..
పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు మారిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది. పీఎస్ఎల్ 2025లో పేశావర్ జల్మీకి ఆడకుండా సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్ ముంబై ఇండియన్స్కు ఆడాడు. ఇక ఇప్పుడు పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్కు ఆడకుండా జింబాబ్వే ప్లేయర్ బ్లెస్సింగ్ ముజరబాని ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడబోతున్నాడు. అలాగే పీఎస్ఎల్లో ఈసారి లాహోర్ కలందర్స్కు కాకుండా శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనాకా రాజస్థాన్ రాయల్స్కు ఆడబోతున్నాడు. ఇక ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ను ఎదుర్కొననుంది. మరోవైపు పీఎస్ఎల్ 2026 మార్చి 26న ప్రారంభం కానుంది.












