
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజ్ చేయనుండగా, ఇప్పటికే రూ.153 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం ఈ సినిమాకు పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఇప్పటి వరకు రూ.44.25 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మార్చి 19, 2026న విడుదల కానున్న ఫస్ట్ డే షోలకు గాను 7 లక్షల టిక్కెట్లను విక్రయించారు. మొత్తం దేశవ్యాప్తంగా తొలి రోజు 17వేల షోలను ప్రదర్శించనుండగా డే1 అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా రూ.33.6 కోట్లు వచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ఓపెనింగ్ వీకెండ్కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లలో రూ.75 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. దీంతో పెయిడ్ ప్రివ్యూలు, మొదటి రోజు దేశవ్యాప్త అడ్వాన్స్ బుకింగ్స్, విదేశీ మార్కెట్లలో ఓపెనింగ్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కలిపి ఓపెనింగ్ విండోలో రూ.153 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ధురంధర్ 2కు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నుంచే ఓపెనింగ్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అభిమానుల్లో భారీ అంచనాలు..
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ మూవీ మొదటి పార్ట్కు కొనసాగింపుగా వస్తోంది. మొదటి పార్ట్ సినిమా కథ ఎక్కడైతే ముగిసిందో తిరిగి అక్కడే రెండో సినిమా కథ ప్రారంభమవుతుంది. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో మొదటి పార్ట్ లాగే ఈ మూవీ కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ధురంధర్ 2కు గాను మార్చి7నే అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించారు. దీంతో తొలి వారం రోజుల వరకు థియేటర్లలో టిక్కెట్లు లభించని పరిస్థితి నెలకొందని ఫ్యాన్స్ అంటున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్తో..
మొదటి భాగం మాదిరిగానే ధురంధర్ 2: ది రివెంజ్ కూడా హై-ఆక్టేన్ యాక్షన్ను కలిగి ఉండనుందని చిత్ర ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ దకైట్ను హతమార్చిన తరువాత అండర్ కవర్ ఏజెంట్ హమ్జా అలీ మజారీ పాత్రలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ సీక్వెల్లో పలు కీలక పాత్రల్లో నటులు మళ్లీ కనిపించనున్నారు. ఆర్.మాధవన్ అజయ్ సన్యాల్ పాత్రలో కనిపించనుండగా, సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో నటించారు. సారా అర్జున్, రాకేష్ బేడీ కూడా కీలక పాత్రలు పోషించారు.












