
హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) తన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో ఇంటిని నిర్మిస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు.
ఇక నుంచి హిందూపురమే కేరాఫ్ అడ్రస్..
తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ ప్రస్తుతం తన మూడో పదవీకాలంలో ఉన్నారు. కాగా తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు 1985లో ఇదే హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని బాలకృష్ణ గుర్తు చేశారు. అదే నియోజకవర్గం నుంచి తనను ఎన్టీఆర్ వారసుడిగా ప్రజలు మూడుసార్లు ఆశీర్వదించారని తెలిపారు. హిందూపురంలోనే ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అభిమానులు, స్థానికులు తనను ప్రోత్సహించారని, అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇక నుంచి హిందూపురమే నా కొత్త కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ చురుగ్గా నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ 2 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తరువాతి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే హిందూపూర్లో ఇల్లు నిర్మిస్తే ఇక ఆయన ఓవైపు అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉంటూనే మరో వైపు హైదరాబాద్ కు వచ్చి సినిమాల్లోనూ నటిస్తూ మరింత చురుగ్గా డ్యుయల్ రోల్ పోషిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.












