
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తన తరువాతి మ్యాచ్లో నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. అయితే ఈ మ్యాచ్కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా సభ్యులకు ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో తన నివాసం ఉంది కనుక గంభీర్ తాజాగా అక్కడ భారత క్రికెట్ జట్టు సభ్యులకు ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం హాజరయ్యారు.
ఆటగాళ్లకు ఊపు ఇచ్చేందుకే..?
అయితే యూఎస్ఏతో మ్యాచ్ అనంతరం గంభీర్ ఈ డిన్నర్ను ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూఎస్ఏ తో మ్యాచ్లో భారత ప్లేయర్లు కాస్తంత నర్వస్ అయినట్లు మ్యాచ్ను చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో ప్లేయర్లలో మళ్లీ జోష్ నింపేందుకు, వారిలో ఉత్సాహాన్ని కలిగించేందుకే కోచ్ గంభీర్ ఆ డిన్నర్ ను ఏర్పాటు చేశారని అర్థమవుతోంది. అయితే యూఎస్ఏతో మ్యాచ్ లో కాస్త ఉంటే భారత్ ఓడిపోయి ఉండేది. కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్తోపాటు బౌలర్ల ప్రదర్శన కారణంగా టీమిండియా ఆ మ్యాచ్లో విజయం సాధించింది. అదే మ్యాచ్లో ఓడిపోయి ఉంటే ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలు కావల్సి వచ్చేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లేయర్లకు కాస్త ఊపు ఇచ్చేందుకే గంభీర్ అలా డిన్నర్ ఏర్పాటు చేశారని అంటున్నారు.
పడిలేచిన కెరటంలా భారత్ ప్రదర్శన..
ఇక టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో భారత్ ఆ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఓ దశలో తీవ్ర ఒత్తిడి బారిన పడినప్పటికీ మళ్లీ పడిలేచిన కెరటంలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 84 పరుగులు చేసిన సూర్య నాటౌట్గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేయగా, మరో బ్యాటర్ తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 25 పరుగులు చేశాడు. యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ షాల్క్విక్ 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, హర్మీత్ సింగ్ 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 132 పరుగులే చేసింది. 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మిలింద్ కుమార్ 4 బౌండరీలతో 34 బంతుల్లో 34 పరుగులు చేయగా, సంజయ్ కృష్ణమూర్తి 31 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్తో 37 పరుగులు చేశాడు. శుభం రంజనె 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 24 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ (2/18) సైతం రాణించాడు.








