
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్ను ఆడబోమన్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం ఏకాభిప్రాయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్కు మద్దతుగా నిలబడడం సరైన నిర్ణయమని తెలిపారు. ఫిబ్రవరి 1న పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తూ, 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు పాల్గొంటుందని, అయితే భారత్తో జరిగే మ్యాచ్కు మాత్రం మైదానంలోకి దిగబోమని వెల్లడించింది. బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తప్పించడంపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ స్పష్టం చేసింది.
పలుమార్లు సమావేశాల అనంతరం..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్కు రావడంపై భద్రతా కారణాలు చూపుతూ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన స్వతంత్ర భద్రతా సమీక్షలో ఎలాంటి విశ్వసనీయ ముప్పు లేదని తేలింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ భారత్కు రావడానికి నిరాకరించడంతో, ఐసీసీ వారిని తప్పించి స్కాట్లండ్ను గ్రూప్ సి లో చేర్చింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్తో జరిగిన పలుమార్లు సమావేశాల తర్వాత, టోర్నీలో పాల్గొనాలని, కానీ భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని తుది నిర్ణయానికి వచ్చారు.
బంగ్లాదేశ్కు మద్దతుగానే నిర్ణయం..
ఈ అంశంపై ఇస్లామాబాద్లో ఫెడరల్ క్యాబినెట్ను ఉద్దేశించి మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. టీ20 వరల్డ్ కప్ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్తో మ్యాచ్ ఆడబోము. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు అన్నదే మా స్థానం. బంగ్లాదేశ్తో మేము నిలబడుతున్నాం. ఇది సరైన నిర్ణయమే.. అని అన్నారు. కాగా ఈ నిర్ణయం క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని ఐసీసీ హెచ్చరిస్తూ పాకిస్థాన్ను పునరాలోచించాలని కోరింది. కానీ ఇప్పటివరకు పీసీబీ అధికారికంగా ఐసీసీకి లేఖ రాయలేదు. సంబంధిత వర్గాల మధ్య అంతర్గత చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఎలో భారత్, పాకిస్థాన్తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఉన్నాయి. ఫిబ్రవరి 7న భారత్, పాకిస్థాన్ రెండూ తమ తొలి మ్యాచ్లతో టోర్నీ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.








