
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించిన ధోనీ మాటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడగా, ఈసారి కూడా భారత్కు అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫార్మాట్లో చిన్నచిన్న అంశాలే బలమైన జట్లను కూడా కూల్చేస్తాయని హెచ్చరించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్పై 4-1తో సిరీస్ గెలిచి, వరుసగా తొమ్మిదో ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయంతో టోర్నీలోకి అడుగుపెడుతోంది.
టాస్ కీలకం: ధోనీ
ఇది అత్యంత ప్రమాదకరమైన జట్టు. ఒక మంచి జట్టుకు కావాల్సిన ప్రతి అంశం ఇందులో ఉంది. అనుభవం అపారంగా ఉంది. ఈ ఫార్మాట్లో ఒత్తిడిలో ఆడిన అనుభవం ప్రతి ఆటగాడికీ ఉంది. తమ పాత్రల్లో వారు చాలాకాలంగా అదే స్థాయిలో కొనసాగుతున్నారు, అని ధోనీ అన్నారు. అయితే, తనకు ఉన్న అతిపెద్ద ఆందోళనను కూడా ధోనీ దాచలేదు. నాకు మంచు అంటే అసహ్యం. మంచు మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తుంది. టాస్ ఎంతో కీలకంగా మారుతుంది. పరిస్థితులు సమానంగా ఉంటే, టాప్ జట్లతో పది మ్యాచ్లు ఆడినా భారత్ ఎక్కువసార్లు గెలుస్తుంది, అని చెప్పారు.
కొన్ని రోజులు మన ఆటగాళ్లకు బ్యాడ్ డే ఉండొచ్చు. అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లు అద్భుతంగా ఆడొచ్చు. ఇది టీ20లో ఎప్పుడైనా జరగవచ్చు. అది లీగ్ దశలోనా, నాకౌట్లోనా అన్నదే కీలకం, అని పేర్కొన్నారు. ఎవరికీ గాయాలు కాకుండా, అందరూ తమ పాత్రలను సరిగా నిర్వర్తిస్తే భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టేనని చెప్పడంలో సందేహం లేదు. కానీ మాటలతో గారడీ చేయదలచుకోను, అంటూ ధోనీ తన అభిప్రాయాన్ని తెలిపారు.








