దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ఈ వారంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల ద్వారా విషయం తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ-బావమరుదులుగా కనిపించనున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఇద్దరి మధ్య చోటుచేసుకునే హాస్యభరిత సంఘటనలు, విభేదాలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనిల్ రావిపూడి స్టైల్కు తగ్గట్టుగా కామెడీ, కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన వినోదాత్మక చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు.
టైటిల్ ఇదేనా..
సాధారణ కథాంశాలను కూడా ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్లుగా మలచడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ చిత్రంలో కూడా తనదైన హాస్యాన్ని, మాస్ ఎలిమెంట్స్ను జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న వర్కింగ్ టైటిల్స్లో జనవరి 13 విడుదల ఒకటి. అయితే తుది టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదు.
నటీనటుల ఎంపిక పూర్తి..
సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ను ఎంపిక చేశారు. కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా కృతి శెట్టి ఇప్పటికే ఖరారైంది. మరో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ మల్టీస్టారర్పై ఇప్పటికే టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

స్పందించండి