Huzurabad : హుజురాబాద్‌లో భారీగా పెరిగిన పోలింగ్‌.. ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూపులు..

October 31, 2021 7:41 PM

Huzurabad : హుజురాబాద్‌లో గ‌తంలో క‌న్నా ఈసారి భారీగా పోలింగ్ పెరిగింది. దీంతో అధికార టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ నేత‌లు కూడా ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే ప‌ట్టం క‌ట్టిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు కొంత ఊర‌ట ఫీల‌వుతున్నా.. ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజ‌మైన ఫ‌లితాలు కావు క‌నుక‌.. వారిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు అధికార తెరాస పార్టీ నేతలు కూడా ఫ‌లితం ఎలా వ‌స్తుందా ? అని ఆందోళ‌న‌గా ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Huzurabad polling increased heavily.. finger crossed for result

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో మొత్తం 86.33 శాతం పోలింగ్ న‌మోదు అయింది. 2.05 ల‌క్ష‌ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 2018 తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం 2.5 వ‌ర‌కు పెరిగింది. దీంతో త‌మ‌కే అనుకూల ఫలితం వ‌స్తుంద‌ని తెరాస‌, బీజేపీలు ఎవ‌రికే వారే ధీమాగా ఉన్నారు. కానీ లోప‌ల మాత్రం ఆందోళ‌న‌గానే క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెరాస‌, బీజేపీల మధ్యే ఈ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా దీన్ని పార్టీల మ‌ధ్య పోరుగా చూడ‌డం లేదు. సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న కోణంలో చూస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మొత్తం 2,36,837 ఓట్లు ఉండ‌గా 2,05,053 మంది ఓటు వేశారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తుంద‌ని అంటున్నారు.

ఇక న‌వంబ‌ర్ 2న ఓట్ల కౌంటింగ్ ఉన్న నేప‌థ్యంలో ఆ రోజు విజేత ఎవ‌రు అనేది స్ప‌ష్టంగా తేల‌నుంది. ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఇరు పార్టీల నేత‌లు మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలోనే నువ్వా నేనా అన్న స్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించారు. తెరాస త‌మ విద్యార్థి విభాగ నాయ‌కుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను బ‌రిలో నిల‌ప‌గా.. ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య పోరు ఉధృతంగా సాగింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు తెరాస ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిరంత‌రాయం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే తాము ఈట‌ల‌పై భారీ మెజారిటీతో గెలుస్తామ‌ని ఆయ‌న ఇప్ప‌టికీ చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో ఉప ఎన్నిక‌లో గెలుస్తామ‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు.

ఇక మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఉప ఎన్నిక‌లో గెలుపుపై ధీమా వ్య‌క్తం చేశారు. తెరాస అనేక విధాలుగా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. డ‌బ్బు, అధికారంతో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవాల‌ని తెరాస చూసింద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌న్నారు.

అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. బీజేపీకి 50 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని, తెరాస‌కు 43 శాతం, కాంగ్రెస్‌కు 5.7 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా రావ‌డం విశేషం. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై ఈట‌ల 43వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈట‌ల‌కు 1,04,840 ఓట్లు వ‌చ్చాయి. కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్తి పి.ర‌ఘుకు 1683 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. నోటాకు 2,867 మంది ఓటు వేశారు.

త‌రువాత కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కౌశిక్ రెడ్డి ఇటీవ‌ల టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆయ‌నకు తెరాస ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ వేసే అవ‌కాశం క‌ల్పించింది. ఈట‌ల రాజేంద‌ర్ 2009 నుంచి హుజురాబాద్‌లో గెలుపొందుతూ వ‌స్తున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తెరాస త‌ర‌ఫునే పోటీ చేస్తూ వ‌చ్చారు. కానీ ఈసారి ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈట‌ల తెరాస ప్ర‌భుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. త‌రువాత వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా రెండో సారి తెరాస అధికారంలోకి వ‌చ్చాక ప‌నిచేశారు. అనంత‌రం ఆయ‌న‌పై భూ ఆక్ర‌మ‌ణల ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఈ క్ర‌మంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now