
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు. నవంబర్ 2025లో హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారణాసి టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ వేడుకకు హాజరైన అంతర్జాతీయ మీడియాతో రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఇటీవల ఎంబార్గో ఎత్తివేయడంతో, చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంగా కథ రెండు భాగాలుగా అవసరమా? అన్న ప్రశ్నకు స్పందించిన రాజమౌళి, చిత్రాన్ని రెండు భాగాలుగా ఆలోచించినప్పటికీ, చివరికి సింగిల్ ఫిల్మ్ గానే నిర్ణయించుకున్నామని తెలిపారు.
మహేష్ బాబు డ్యుయల్ రోల్..
ఈ చిత్ర నిడివి సుమారు మూడు గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందని వెల్లడించారు. తన కథన శైలితో ఈ పొడవునా ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుతానన్న ధీమాను రాజమౌళి వ్యక్తం చేశారు. కాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుత కాలానికి చెందిన రుద్రగా, అలాగే శ్రీరాముడిగా. ప్రియాంకా చోప్రా మందాకినిగా నటిస్తుండగా, వీల్చైర్లో కనిపించే బలమైన ప్రతినాయక పాత్ర కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
భారీ స్థాయి నిర్మాణ విలువలతో పౌరాణికత, కాలయానం, యాక్షన్ అడ్వెంచర్ల మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఆరు పాటలు చిత్రానికి మరింత ఆకర్షణను అందించనున్నాయి.








