
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సందడి చేసిన నటీనటుల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా 2024లో రిలీజ్ అయిన దక్షిణ భారత చిత్రాలకు గాను పలు విభాగాల్లో అవార్డులను అందజేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అయితే ఈ వేడుకలపై హర్షం వ్యక్తం చేసిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఒక్క విషయంలో మాత్రం నిరాశ చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. తొలిసారిగా అవార్డును అందుకున్న వారికి వేదికపై మాట్లాడేందుకు కనీస సమయం కేటాయించనందుకు ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలిసారి అవార్డు గ్రహీతలకు దక్కని గౌరవం: నిహారిక
ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించినందుకు, పలు విభాగాల్లో అవార్డులను అందజేసినందుకు సంతోషంగా ఉందని నిహారిక తన పోస్టులో పేర్కొన్నారు. కానీ మొదటిసారిగా అవార్డులను తీసుకున్న విజేతలను ఈ కార్యక్రమంలో సరిగ్గా గౌరవించలేదని విచారం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ ఒకే వేదికపై సందడి చేయడం ఆనందంగా ఉందని, కానీ తొలిసారి అవార్డు పొందిన తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన వ్యక్తులకు వేదికపై మాట్లాడే అవకాశం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. వారికి అలాంటి ప్రతిష్టాత్మక వేదికపై తమ గొంతుకను వినిపించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఒక నటుడు తన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడితే అలాంటి వారికి ఇలాంటి వేదికలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు గొప్ప వేదికలుగా మారుతాయని అన్నారు.
View this post on Instagram
పాజిటివ్గా స్పందిస్తున్న నెటిజన్లు..
మొదటిసారి అవార్డులను పొందిన వారి మాటలను వింటే వారికి సినిమా అంటే ఎందుకు అంత ఇష్టమో అర్థమవుతుందని నిహారిక స్పష్టం చేశారు. ఇలాంటి భారీ అవార్డు కార్యక్రమాలలో అందరికీ తగిన సమయం కేటాయించడం సమస్యగానే ఉంటుందని అంగీకరించిన నిహారిక, తొలిసారిగా స్టేజీ మీద అవార్డు పొందిన వారికి కనీసం ఒక అవకాశం ఇస్తే బాగుండేదని అన్నారు. కనీసం వారికి ఒక నిమిషం అయినా కేటాయించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అది వారికి జీవితాంతం ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. అయితే నిహారిక పోస్టుపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యల్లో నిజం ఉందని, ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.












