
నటి మృణాల్ ఠాకూర్ కెరీర్లో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ తన ప్రారంభ దశల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 20, 2026న విడుదలకు సిద్ధమవుతున్న దో దీవానే సేహర్ మేన్ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న మృణాల్, అవకాశాలు తనకు సులభంగా రాలేదని, వాటి కోసం తానే ముందుకు వెళ్లి ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు. న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అవకాశాలు నా దగ్గరకు తానే వచ్చి తలుపు తట్టలేదు. నేను వాటిని వెతుక్కోవాల్సి వచ్చింది. దర్శకుల ముందు నిలబడి సర్, నేనున్నాను. ఎప్పుడైనా కాస్ట్ చేయండి, అని చెప్పాల్సి వచ్చింది. ఇందులో నాకు ఎలాంటి సంకోచం లేదు. నిజానికి నేను మొదటిసారి పని అడిగిన దర్శకుడు ఆదిత్య ధర్.. అని వెల్లడించారు.
అభిమానం చాటేందుకు వెనుకాడను: మృణాల్
గతేడాది బ్లాక్బస్టర్గా నిలిచిన ధురంధర్ తర్వాత ప్రస్తుతం ధురంధర్: ది రివెంజ్ సీక్వెల్తో బిజీగా ఉన్న ఆదిత్య ధర్ను, తన తొలి ప్రయత్నాల రోజుల్లోనే కలిశానని మృణాల్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నాకు ఎలా పని అడగాలో కూడా తెలియదు. ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కానీ ఆ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.. అని ఆమె అన్నారు. తన పని పట్ల ఉన్న ఆకాంక్షే తనను ముందుకు నడిపిందని మృణాల్ చెప్పింది. నేను ఎవరికైనా అభిమానిని అయితే అది చెప్పడానికి వెనకాడను. వారి నంబర్ దొరకకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను. ఒక పాత్ర కోసం నిజంగా ఎదురు చూస్తున్నానని దర్శకులకు తెలిసినప్పుడు, వారి దృష్టికోణం కూడా మారుతుందని వివరించారు.
భన్సాలీతో సినిమా చేయాలని కోరిక..
తాజా చిత్రం దో దీవానే సేహర్ మేన్ విషయానికి వస్తే, ఈ అవకాశాన్ని కూడా తానే గుర్తించి ముందడుగు వేసినట్లు చెప్పారు. ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలన్న కోరికను నేరుగా వ్యక్తం చేశానని, అదే ధైర్యం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా నగర నేపథ్యంలో సాగే ఈ చిత్రం, తమను తాము అర్థం చేసుకుంటూ, భావోద్వేగాల మధ్య సాగుతున్న ఇద్దరి ప్రయాణాన్ని చూపనుంది. ప్రేమను కథలా కాకుండా, సహనం, అవగాహన, నిజాయితీతో ఎదిగే బంధంగా ఆవిష్కరించడమే చిత్ర ప్రత్యేకతగా దర్శకులు చెబుతున్నారు. జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఇలాఆరుణ్, జాయ్ సేన్గుప్తా, విరాజ్ గెహ్లానీ, సందీపా ధర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.








