
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య రాకూడదని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకునే వారి కారణంగా ఎవరికీ నష్టం జరగకుండా ఉండాలని, త్వరలోనే ఇది ముగిసి అందరి ప్రాణాలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం యూఏఈలో ఉన్నానని తెలిపిన లారాదత్తా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, యూఏఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తదితర వివరాలపై మాట్లాడారు.
బయటి నుంచి శబ్దాలు వచ్చాయి: లారాదత్తా
యూఏఈకి తాను ఓ బ్రాండ్ ప్రమోషన్పై వచ్చానని లారా దత్తా వీడియోలో వివరించారు. తాను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన తాను స్టూడియోలో ఉండగా బయటి నుంచి భారీ విస్ఫోటన శబ్దాలు వినిపించాయని, వెంటనే భయంతో బయటకు పరుగెత్తి చూస్తే మిస్సైల్స్ను అడ్డుకుని ఆకాశంలోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయని అన్నారు. ఆ సమయంలో చాలా భయం కలిగిందని, తన కుమార్తె సైరా భూపతి కూడా తనతోనే ఉందని, కానీ భర్త మహేష్ భూపతి దుబాయ్ లో లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నానని తెలిపారు.
View this post on Instagram
యూఏఈ ప్రభుత్వంపై పొగడ్తలు..
దుబాయ్లో తాము ఓ కమ్యూనిటీలో విల్లాలో సురక్షితంగా ఉన్నామని లారాదత్తా తెలిపారు. కానీ రోజూ ఫైటర్ జెట్స్, బాంబుల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, అత్యంత ఆందోళకర వాతావరణం నెలకొందని చెప్పారు. శబ్దాల కారణంగా కిటికీలు షేక్ అవుతున్నాయని, డోర్లు దడదడా కొట్టుకుంటున్నాయని దీంతో క్షణ క్షణం ఆందోళనగా ఉందని అన్నారు. అయినప్పటికీ తమకు సురక్షితంగానే ఉన్నామన్న భావన ఉందని, యూఏఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, తమ పౌరులను రక్షించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని కితాబిచ్చారు. ఏ దేశానికి చెందిన వారైనా సరే యూఏఈ ప్రభుత్వం తమ సొంత పౌరులుగా చూస్తుందని, ఇది తనకు ఎంతో సురక్షితంగా ఉన్నామన్న భావనను కలిగిస్తుందని అన్నారు.
ఇండియా రావాలని చూస్తున్నా..
ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ దుబాయ్లో ప్రస్తుతం ప్రజల రోజువారి జీవన విధానం సాధారణంగానే ఉందని, ప్రజలు మళ్లీ యథావిధిగా తమ రోజువారి కార్యకలపాలను నిర్వహిస్తున్నారని లారాదత్తా తెలిపారు. జనజీవనం అంతా సాధారణంగానే ఉందని, ప్రజలు రోజూలాగే తమ పనులను తాము చేసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం ముంబై చేరుకునేందుకు తాను విమాన సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే ఇండియాకు రీచ్ అయి మళ్లీ ఫ్యామిలీతో కలుస్తానని తెలిపారు. కాగా యూఏఈలో ఉన్న సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా, పీవీ సింధు తదితరులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇంకా చాలా మంది సెలబ్రిటీలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజలందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఒక్కటే, యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని. దానికి కాలమే సమాధానం చెబుతుంది.












