
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు గురైన ఈ సినిమా, సెన్సార్ అనుమతి పొందకముందే చిత్రంలోని కొన్ని భాగాలు ఆన్లైన్లో లీక్ కావడంతో కొత్త సమస్య బారిన పడింది. ముఖ్యంగా ఈ చిత్రం రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావచ్చనే నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులు, మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రానికి చెందిన 5 నిమిషాల 31 సెకన్ల నిడివి గల క్లిప్ లీక్ అయింది. ఈ వీడియో ఎక్స్, యూట్యూబ్, రెడిట్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో విస్తృతంగా షేర్ అవుతోంది. లీక్ అయిన ఫుటేజ్లో టైటిల్ క్రెడిట్స్, విజయ్ ప్రవేశ సన్నివేశం, అలాగే ఒక యాక్షన్ ఫైట్ సీన్ ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టులను తొలగించినప్పటికీ ఆ క్లిప్ ఇంకా విస్తృతంగానే వైరల్ అవుతోంది.
ఎలా చేసి ఉంటారు..?
ఈ వీడియోను థియేటర్లో జరిగిన టెస్ట్ స్క్రీనింగ్ సమయంలో లేదా ఎడిటింగ్ దశలో రికార్డ్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్లిప్ చివర్లో ఒక వ్యక్తి వీడియోను పాజ్ చేస్తున్నట్లు కనిపించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి, ఇది అంతర్గతంగా జరిగిన లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలకు దారితీసింది. అయితే ఈ ఫుటేజ్ ఎలా లీక్ అయిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. లీక్ అయిన వీడియోను షేర్ చేయవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక మంది సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్ అకౌంట్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైందని హెచ్చరిస్తూ, వీడియోను షేర్ చేసే వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఎవరూ షేర్ చేయకండి: సీబీ సత్యరాజ్
నటుడు సీబీ సత్యరాజ్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. జన నాయకన్ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ లీక్ అయిందని విని షాక్కు గురయ్యానని అన్నారు. ఒక సినిమాను తీయడంలో ఎంత డబ్బు, కష్టం, శ్రమ ఉంటుందో దీన్ని చేసిన వారు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ వీడియోలను చూడకుండా, షేర్ చేయకుండా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. చిత్ర నిర్మాత జి. ధనంజేయన్ ఈ లీక్ను అసహ్యకరమైనదిగా అభివర్ణిస్తూ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ్ చివరి సినిమా కావచ్చనే నేపథ్యంలో దీన్ని లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే భావాన్ని పంచుకుంటూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రూ.400-రూ.500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ఒక్కరాత్రిలో లీక్ కావడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మొత్తం బృందానికి కఠిన సమయమని అన్నారు. ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంపై మరింత జాగ్రత్త అవసరమవుతోందని అన్నారు.
ఆలస్యమవుతున్న విడుదల..
ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించగా, ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తొలుత జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అనంతరం ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ అది కూడా జరగలేదు. ఈ ఆలస్యంపై నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికేషన్ పొందకపోవడం, విడుదల తేదీ ఖరారు కాకపోవడం నడుమ ఈ లీక్ ఘటన జన నాయకన్ చిత్రానికి మరో పెద్ద సమస్యగా మారింది.












