
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు జై హనుమాన్ అనే మూవీని సీక్వెల్గా ప్రకటించారు. కానీ ఆ మూవీని పట్టాలెక్కించడం ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు జై హనుమాన్ మూవీ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. విజయనగరలోని హంపిలో ఉన్న అంజనాద్రి బెట్టలో జై హనుమాన్ చిత్ర షూటింగ్ను లాంఛనంగా మొదలు పెట్టారు. అంజనాద్రి బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తుండడంతో చిత్ర యూనిట్ సెంటిమెంట్గా అక్కడే షూటింగ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతోపాటు చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న రిషబ్ శెట్టి, నటుడు తేజ సజ్జా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రిషబ్ శెట్టి లీడ్ రోల్లో..
జై హనుమాన్ చిత్ర షూటింగ్ ప్రారంభం సందర్భంగా ముహుర్త సన్నివేశ చిత్రీకరణకు భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా అనిల్ తడాని కెమెరా స్విచాన్ చేశారు. నటుడు తేజ సజ్జా తొలి షాట్కు లాంఛనంగా దర్శకత్వం వహించారు. జై హనుమాన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, బాలీవుడ్కు చెందిన టి-సిరీస్ సంస్థ దీన్ని సమర్పిస్తోంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో లీడ్ రోల్లో ఆంజనేయ స్వామి పాత్రలో నటిస్తున్నారు. కలియుగంలో ధర్మం, నీతి, న్యాయం అనే అంశాలకు, దుష్టశక్తులకు మధ్య జరిగే పోరాటంగా జై హనుమాన్ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఎస్.తిరుణవుక్కరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు.
పీవీసీయూ ఇప్పట్లో లేనట్లే..?
హనుమాన్ సినిమా 2024లో రిలీజ్ కాగా అప్పట్లోనే జై హనుమాన్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. కానీ తాను పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర నటులతో భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాని చెప్పి ఆయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)ను కూడా ప్రకటించారు. అయితే ఏ ఒక్క సినిమా కూడా కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే ప్రకటించన జై హనుమాన్ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్ర షూటింగ్ అధికారికంగా ప్రారంభం కావడంతో ఇక పీవీసీయూలో ఇప్పట్లో సినిమాలు రావని, జై హనుమాన్ తరువాతే వస్తాయని అర్థమవుతోంది.












