
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. దీపికా పదుకొనెకు ఇటీవలి కాలంలో అనేక చేదు సంఘటనలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. మొదట్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ నుంచి ఆమెను తొలగించామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పారు. తరువాత కల్కి 2 నుంచి కూడా ఆమెను తప్పించారు. అయితే ఇప్పుడు ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ను కూడా ఆమె మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆమె ఇన్స్టాలో ఈ విషయాలపై పరోక్షంగా స్టోరీని పోస్ట్ చేశారని సమాచారం. ఈ క్రమంలో దీపికా ఇంకా తన స్టోరీలో పలు వివరాలను వెల్లడించారు.
ప్రతిదానికి స్పందించాల్సిన పనిలేదు..
అరిచి పెద్దగా మాట్లాడేందుకు ఎటువంటి శక్తి, బలం అవసరం లేదని, కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండడంలోనే అసలైన బలం దాగి ఉందని దీపికా పదుకొనె అన్నారు. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్తబ్దుగా, ప్రశాంతంగా ఉండాలని అన్నారు. అంతేకానీ భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదని పేర్కొన్నారు. ఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదని, ప్రశాంతంగా ఉండడం అనేది బలహీనత కాదని స్పష్టం చేశారు. అదొక శక్తి అని, మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి దానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదని, ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థం పర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్గా ఉండడమే అన్నింటికంటే పెద్ద సూపర్ పవర్ అని దీపికా పదుకొనె రాసుకొచ్చారు. కాగా ఆమె స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఆ సిరీస్ చేజారిందా..?
ఇటీవలే ది వైట్ లోటస్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్కు సంబంధించి సీజన్ 4 కోసం మేకర్స్ దీపికా పదుకొనెను సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టులో నటించాలంటే కచ్చితంగా ఆడిషన్ చేయాలని మేకర్స్ చెప్పినట్లు సమాచారం. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న తనకు మళ్లీ ఆడిషన్ ఏంటని ఆమె ఈ చాన్స్ను వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకనే ఆమె ఇన్డైరెక్ట్గా అలా స్టోరీని పోస్ట్ చేసి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఆమె ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తుండగా, అల్లు అర్జున్ మూవీలో కూడా చాన్స్ వచ్చినట్లు తెలిసింది. కానీ దీనిపై స్పష్టత రాలేదు. ఏది ఏమైనా దీపికాకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందని, అందుకనే ఆఫర్లు చేజారిపోతున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












