
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న అవాస్తవ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తన రెండో వివాహంపై సోషల్ మీడియాలో విస్తరిస్తున్న వదంతులు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె స్పష్టం చేశారు. దృశ్యం 3లో మళ్లీ మోహన్లాల్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్న వేళ ఈ తరహా పుకార్లు మళ్లీ తెరపైకి రావడం బాధాకరమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనా.. నా రెండో పెళ్లి గురించి పదే పదే మాట్లాడటం పూర్తిగా అసహ్యకరం. నాకు ఒక కూతురు ఉంది. ఈ వార్తలన్నీ ఆమె కూడా చూస్తుంది అన్న సంగతి వాళ్లు మర్చిపోతున్నారు. అది మా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెడుతోంది.. అని వేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నప్పటికీ, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఆమె హెచ్చరించారు.
తీవ్ర పరిణామాలు తప్పవు: మీనా
నటి, మహిళ కావడం వల్ల తమ వ్యక్తిగత జీవితంపై ఎవరైనా ఏదైనా రాయొచ్చన్న భావన కొందరిలో ఉందని మీనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం అన్నదే లేదు. నిజానికి కాస్తైనా ఆధారం ఉంటే ఓ అర్థం. కానీ కళ్లారా చూసినట్టు అబద్ధాలు రాయడం నన్ను బాధపెడుతోంది, కోపం తెప్పిస్తోంది.. అని మీనా అన్నారు. తాను ప్రతికూలతలను దూరంగా ఉంచుతూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని, అయినా ఇతరులను గాయపరిస్తే దానికి పరిణామాలు తప్పవని మీనా అన్నారు. ఇతరులను బాధపెట్టిన వారికి కర్మ తప్పదు అని ఆమె హెచ్చరించారు. తన పెళ్లి గురించి మాట్లాడే హక్కు తనకే ఉందని, బయటి వాళ్లు కథలు అల్లడం సరికాదని స్పష్టం చేశారు.
కాగా సినిమాల విషయానికి చూస్తే మీనా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం దృశ్యం 3 ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం, ఆమె నటనా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని ఫ్యాన్స్ అంటున్నారు.












